సాక్షి,కరీంనగర్: ఆన్లైన్ జూదం, బెట్టింగ్ల వలయంలో చిక్కుకుని అప్పులపాలైన ఒక 21 ఏళ్ల విద్యార్థి, డబ్బుల కోసం ఓ మహిళను నమ్మించి తీసుకెళ్లి, దోచుకుని, ఆపై చంపేందుకు బావిలోకి నెట్టేసిన షాకింగ్ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. చావు అంచుల వరకు వెళ్లిన ఆ మహిళ సుమారు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడి, ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది.
కేసు వివరాల్లోకి వెళ్తే...కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన తంగరాల లక్ష్మి (55) అనే దినసరి కూలీ జూలై 1న పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొదట సాధారణ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే, మరుసటి రోజు ఉదయం నుస్తులాపూర్ గ్రామ శివార్లలోని ఒక వ్యవసాయ బావిలో మహిళ పడి ఉన్నట్లు స్థానిక రైతులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను రక్షించారు.
పోలీసుల విచారణలో బాధితురాలు లక్ష్మి అసలు నిజాన్ని బయటపెట్టింది. ఒక అపరిచిత వ్యక్తి తన పొలంలో పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడని ఆమె తెలిపింది. మొదట ర్యాపిడో బైక్ బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు, జనం ఎక్కువగా ఉండటంతో, నిర్మానుష్య ప్రాంతం కోసం ఆమెను తన సొంత బైక్పై నుస్తులాపూర్ శివార్లలోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ లక్ష్మిని బెదిరించి ఆమె వద్ద ఉన్న 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి పట్టీలు, నగదును దోచుకున్నాడు.
తాను దొరికిపోకూడదనే ఉద్దేశంతో, నిందితుడు లక్ష్మిని అక్కడే ఉన్న ఒక లోతైన వ్యవసాయ బావిలోకి నెట్టేశాడు. బావిలో పడ్డాక ఆమె లోపల ఉన్న ఒక తాటిని పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది. అది గమనించిన నిందితుడు, ఆమె ఎలాగైనా చంపాలనే క్రూరమైన ఆలోచనతో ఆ తాడును కూడా కత్తిరించాడు.

అయితే లక్ష్మికి ఈత రావడం ఆమె ప్రాణాలను కాపాడింది. తాడు తెగినా ధైర్యం కోల్పోకుండా, మోటార్ పైప్లైన్కు ఉన్న కేబుల్ వైరును పట్టుకుని రాత్రంతా బావిలోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం రైతులు ఆమె అరుపులు విని బయటకు తీసేవరకు, దాదాపు 21 గంటల పాటు ఆమె మృత్యువుతో పోరాడింది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని ధమ్మ దినేష్ రెడ్డి (21) అనే విద్యార్థిగా గుర్తించారు. ర్యాపిడో బుకింగ్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా ఆధారంగా ప్రత్యేక బృందం నిందితుడిని పట్టుకుంది. విచారణలో అతను ఆన్లైన్ జూదం, బెట్టింగ్ యాప్లలో దాదాపు రూ. 4 లక్షలు నష్టపోయి అప్పులపాలయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు.
అలాగే, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన ఒక జ్యువెలరీ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.


