breaking news
betech student
-
బావిలో 21 గంటల నరకం.. చంపేయాలని తాడు కత్తిరించినా..
సాక్షి,కరీంనగర్: ఆన్లైన్ జూదం, బెట్టింగ్ల వలయంలో చిక్కుకుని అప్పులపాలైన ఒక 21 ఏళ్ల విద్యార్థి, డబ్బుల కోసం ఓ మహిళను నమ్మించి తీసుకెళ్లి, దోచుకుని, ఆపై చంపేందుకు బావిలోకి నెట్టేసిన షాకింగ్ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. చావు అంచుల వరకు వెళ్లిన ఆ మహిళ సుమారు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడి, ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది.కేసు వివరాల్లోకి వెళ్తే...కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన తంగరాల లక్ష్మి (55) అనే దినసరి కూలీ జూలై 1న పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొదట సాధారణ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే, మరుసటి రోజు ఉదయం నుస్తులాపూర్ గ్రామ శివార్లలోని ఒక వ్యవసాయ బావిలో మహిళ పడి ఉన్నట్లు స్థానిక రైతులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను రక్షించారు.పోలీసుల విచారణలో బాధితురాలు లక్ష్మి అసలు నిజాన్ని బయటపెట్టింది. ఒక అపరిచిత వ్యక్తి తన పొలంలో పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడని ఆమె తెలిపింది. మొదట ర్యాపిడో బైక్ బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు, జనం ఎక్కువగా ఉండటంతో, నిర్మానుష్య ప్రాంతం కోసం ఆమెను తన సొంత బైక్పై నుస్తులాపూర్ శివార్లలోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ లక్ష్మిని బెదిరించి ఆమె వద్ద ఉన్న 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి పట్టీలు, నగదును దోచుకున్నాడు.తాను దొరికిపోకూడదనే ఉద్దేశంతో, నిందితుడు లక్ష్మిని అక్కడే ఉన్న ఒక లోతైన వ్యవసాయ బావిలోకి నెట్టేశాడు. బావిలో పడ్డాక ఆమె లోపల ఉన్న ఒక తాటిని పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది. అది గమనించిన నిందితుడు, ఆమె ఎలాగైనా చంపాలనే క్రూరమైన ఆలోచనతో ఆ తాడును కూడా కత్తిరించాడు.అయితే లక్ష్మికి ఈత రావడం ఆమె ప్రాణాలను కాపాడింది. తాడు తెగినా ధైర్యం కోల్పోకుండా, మోటార్ పైప్లైన్కు ఉన్న కేబుల్ వైరును పట్టుకుని రాత్రంతా బావిలోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం రైతులు ఆమె అరుపులు విని బయటకు తీసేవరకు, దాదాపు 21 గంటల పాటు ఆమె మృత్యువుతో పోరాడింది.కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని ధమ్మ దినేష్ రెడ్డి (21) అనే విద్యార్థిగా గుర్తించారు. ర్యాపిడో బుకింగ్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా ఆధారంగా ప్రత్యేక బృందం నిందితుడిని పట్టుకుంది. విచారణలో అతను ఆన్లైన్ జూదం, బెట్టింగ్ యాప్లలో దాదాపు రూ. 4 లక్షలు నష్టపోయి అప్పులపాలయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు.అలాగే, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన ఒక జ్యువెలరీ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. -
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
సాక్షి,హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. జాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కంటైనర్ను ఢీకొన్న బైక్: బీటెక్ విద్యార్థి మృతి
కోట (నెల్లూరు జిల్లా): ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని అదుపు తప్పి బైక్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విద్యానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని ఉప్పలమర్తికి చెందిన చందు, సూళ్లూరుపేటకు చెందిన సమీర్ ఎన్బీకేఆర్లో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడి బైక్ తీసుకుని కోటకు వెళ్లి తిరిగి విద్యానగర్ కళాశాల వద్దకు వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న రొయ్యల కంటైనర్ లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో బైక్ కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారకస్థితిలోకి చేరుకున్న క్షతగాత్రులను స్థానికులు కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమీర్కు తలకు తీవ్రగాయం కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సమీర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎన్బీకేఆర్ అధ్యాపకులు, విద్యార్థులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సమీర్ తండ్రి ఎస్దాని షార్ కేంద్రంలో పని చేస్తున్నాడు. కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కళాశాల భవనం పైనుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి
ఘట్కేసర్: ఇంజినీరింగ్ కళాశాలపై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్లోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. కళాశాలలో రెండో సంవత్సరం(మెకానికల్) చదువుతున్న దినేష్(19) భవనం పై నుంచి పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అనే కోణంలో దృష్టి సారించారు. దినేష్ నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


