అలా చేయాలంటే నన్ను చంపాల్సిందే: మమతా బెనర్జీ | Defiant Mamata Banerjee Calls Trinamool Rebels Traitors | Sakshi
Sakshi News home page

అలా చేయాలంటే నన్ను చంపాల్సిందే: మమతా బెనర్జీ

Jul 4 2026 8:58 PM | Updated on Jul 4 2026 9:08 PM

Defiant Mamata Banerjee Calls Trinamool Rebels Traitors

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొన్న ఘోర పరాజయం తర్వాత కూడా వరుస ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వెనక్కి తగ్గట్లేదు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నేతృత్వంలో వర్గంగా ఏర్పడగా, లోక్‌సభ ఎంపీలు మూడో వర్గాన్ని ఏర్పాటు చేసి అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది అనే పోటీకి తెరతీశారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరిన మమతా బెనర్జీ.. తనను ఆపాలంటే తనను చంపాల్సిందేనని అన్నారు.

రెబల్‌ నేతలను మమతా బెనర్జీ ద్రోహులుగా పేర్కొన్నారు. అయినా తనదైన పోరాట శైలిలో మాట్లాడుతూ.. పార్టీ గుర్తు తనకు విధేయంగా ఉన్న వర్గం వద్దే ఉంటుందని చెప్పారు. దీనివల్ల తిరుగుబాటు వర్గానికి సుదీర్ఘ న్యాయపోరాటం ఎదురయ్యే అవకాశం ఉందని సంకేతమిచ్చారు. "పార్టీ గుర్తు ఎక్కడికీ వెళ్లదు. నన్ను ఆపాలంటే నన్ను చంపాల్సిందే" అని అన్నారు.

తనకు విధేయంగా మిగిలిన కొద్దిమంది ముఖ్య నేతల్లో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ శాఖ అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య కూడా శనివారం రాజీనామా చేయడంతో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గంలో ఆమె కూడా చేరారు. ఆ వర్గం మద్దతుదారులు శుక్రవారం కొల్‌కతాలోని పార్టీ కార్యాలయంపై ఆధిపత్యం సాధించారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్‌ వర్గం కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనంలోకి తీసుకుంది.

ఒత్తిడి వల్లే వారు పార్టీని వీడారు: మమత 
"చంద్రిమా భట్టాచార్య ఈరోజు రాజీనామా చేశారు. ఆమె రాజీనామా చేస్తారని ముందే నాకు చెప్పారు. ఆమె కుమారుడు ఇప్పటికే తృణమూల్ వ్యతిరేక వర్గంతో చేతులు కలిపారు" అని మమతా బెనర్జీ చెప్పారు. అయితే తిరుగుబాటు వర్గంలో తాను ఎప్పటికీ చేరబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆ వర్గం ఇచ్చిన సలహాదారు పదవిని కూడా తిరస్కరించారు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, కానీ తాను వారితో చేతులు కలపనని చెప్పారు. ఒత్తిడి వల్లే వారు పార్టీని వీడారని మమత ఆరోపించారు. కానీ తాను బీజేపీ ముందు తలవంచనని, తన పార్టీ కూడా ఎలాంటి ఒత్తిడికీ తలవంచదని తెలిపారు.

పార్టీ కార్యాలయాన్ని తిరుగుబాటు వర్గం స్వాధీనం చేసుకున్న అంశంపైనా మమతా బెనర్జీ స్పందించారు. "నిన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి తాళం వేసిన వారికి నేను ఒకటే చెబుతున్నా. ఆ కార్యాలయాన్ని మేము అద్దెకు తీసుకున్నాం. 2027 అక్టోబర్ వరకు లీజు ఉంది. ఒక వ్యక్తి పార్టీని వీడొచ్చు. కానీ, పార్టీ అనే సంస్థ అంతమైపోదు. అది పార్టీ ఆస్తి. నేను దానిని స్వాధీనం చేసుకోలేను" అని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతం బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు.

"పార్టీ గుర్తును ఇచ్చింది నేనే. 2026 ఎన్నికల్లో మీ నామినేషన్లపై సంతకం చేసింది నేనే. ఎన్నికలు ముగిసి రెండు నెలలకే మీరు ఎలా ద్రోహులయ్యారు? దానికీ ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నారు. ఇది ఇలా కొనసాగదు. తృణమూల్ సిద్ధాంతం బీజేపీ వ్యతిరేకం" అని అన్నారు.

చంద్రిమా భట్టాచార్య రాజీనామా తర్వాత జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ బాధ్యతలు తానే చేపట్టినట్లు తెలిపారు. తన ఇంట్లో ఉన్న పార్టీ కార్యాలయమే ఇక నుంచి తృణమూల్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుందని ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement