ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ, ఈ వారం ప్రారంభం నుండి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఐలాండ్ సిటీలో సగటున 99 మి.మీ, తూర్పు శివారు ప్రాంతాలలో 98 మి.మీ, పశ్చిమ శివారు ప్రాంతాలలో 94 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


