ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అనారోగ్యం బారినపడి, శనివారం థానేలోని జుపిటర్ ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి ఆయన స్వల్ప జ్వరం, నీరసం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యుల సలహా మేరకు ముందస్తు జాగ్రత్తగా ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అధిక పనిభారమే కారణం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గత కొన్ని రోజులుగా పర్యటనలు, రాజకీయ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడం, తీవ్రమైన పనిభారం కారణంగానే షిండే అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయనకు జ్వరం వచ్చి, తీవ్ర నీరసానికి గురైనట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా షిండే శనివారం నాటి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయను చికిత్స నిమిత్తం థానేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే షిండే ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని శివసేన వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామాల్లో షిండే చురుగ్గా పాల్గొన్నారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలతో పాటు ముంబయి శాసనమండలి సభ్యుడు సచిన్ అహిర్.. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ ‘ఆపరేషన్ టైగర్’ వ్యూహంలో షిండే కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పలుమార్లు ఢిల్లీ పర్యటనలు కూడా చేశారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.


