భోపాల్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు శుభాకాంక్షలు చెబుతూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి ఉన్న ఒక ఫొటో ప్రచురితమయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఫొటోపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు జూన్ 26న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం భోపాల్లో ఉంటోంది. ఆయన సీఎస్గా అత్యున్నత పదవిని చేపట్టిన తరుణంలో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక పత్రికలో శుభాకాంక్షల ప్రకటనను ఇచ్చారు.
ఇది సాధారణ ప్రకటనలా కనిపించినప్పటికీ, అందులో కనిపిస్తున్న ఫొటో చర్చకు దారితీసింది. ఆ ఫొటో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినదో ప్రకటనలో పేర్కొనలేదు. అలాగే ఈ ఫొటో ఎంపికలో సంజయ్ జాజు ప్రమేయం ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవిలో ఉన్న అధికారి రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా కనిపించాలని కొందరు అభిప్రాయపడుతుండగా, ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంతో కలిసి ఫొటో దిగడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని మరికొందరు అంటున్నారు.


