సాక్షి, హైదరాబాద్: ఫొటో..ప్రతి జ్ఞాపకాన్ని పదిలంగా మారుస్తుంది. అందుకే మానవ జీవితంలో ఓ భాగమైంది. తరతరాలుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఫొటో తీరూ మారింది. ఇవాళ ప్రపంచ ఫొటోగ్రఫీ డే. ఈ నేపథ్యంలో ఫొటోగ్రఫీలో నగర వారసత్వ వైభవాన్ని పరిశీలిస్తే...18వ శతాబ్దంలోనే భాగ్యనగరం దేశ ఫొటోగ్రఫీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రఖ్యాత భారతీయ ఫొటోగ్రాఫర్ రాజా దీన్దయాళ్ నగరవాసే. 1880లో ఆయన నిజాం నవాబుల వద్ద ఫొటోగ్రాఫర్గా పనిచేశారు. నగరానికి చెందిన ఎన్నో జ్ఞాపకాలను తన కెమెరాలో బంధించారు. నిజాం నవాబుల కట్టడాలు, వారి జీవనశైలిని ఫొటోల్లో బంధించారు. అప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అప్పటి ఫొటోగ్రఫీలో నేటి డిజిటల్ కెమెరాల సౌలభ్యం లేదు. గాజు ప్లేట్లపై చిత్రాలను రికార్డు చేసే వారు. అయినప్పటికీ దీన్ దయాళ్ తీసిన ఫొటోలు నాటి హైదరాబాద్ జీవన విధానానికి అద్దం పట్టాయి. రాజభవనాల వైభవం నుంచి సాధారణ ప్రజల జీవితం వరకు ఆయన కెమెరా చూపు విస్తరించింది. ఆయనకు సంబంధించిన వేలాది గ్లాస్ ప్లేట్ నెగెటివ్లు చారిత్రక ఆధారాలుగా నిలిచాయి.
కాలం..చిత్రం..మారింది
స్టూడియో కెమెరాలు, ఫిల్మ్ రోల్స్, నెగెటివ్లు, డార్క్రూమ్లు దాటి ఫోటోగ్రఫీ ఇప్పుడు స్మార్ట్ఫోన్లోకి వచ్చేసింది. హైదరాబాద్లోనూ ఫోటోగ్రఫీ ఒక ప్రొఫెషన్ మాత్రమే కాకుండా కళ, జర్నలిజం, డాక్యుమెంటేషన్, సోషల్ మీడియా, సినిమాటోగ్రఫీ, స్ట్రీట్ ఫోటోగ్రఫీ వంటి అనేక రూపాల్లో విస్తరించింది. హైదరాబాద్ సెంటర్ ఫర్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు నగరంలోని ఫోటోగ్రఫీ కమ్యూనిటీ ఎంత విస్తరించిందో చూపిస్తున్నాయి.
2024లో 500కుపైగా ఎంట్రీల నుంచి 42 మంది ఫొటోగ్రాఫర్ల చిత్రాలను ప్రదర్శించగా, 2025లో 550కుపైగా ఎంట్రీల నుంచి 44 మంది హైదరాబాద్, తెలంగాణ ఫోటోగ్రాఫర్ల చిత్రాలను ఎంపిక చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వంటి విద్యాసంస్థలు కూడా ఫొటోగ్రఫీని కేవలం కెమెరా నైపుణ్యంగా కాకుండా విజువల్ స్టోరీ టెల్లింగ్గా ప్రోత్సహిస్తున్నాయి. 2025లో నిర్వహించిన కార్యక్రమాల్లో మొబైల్ ఫొటోగ్రఫీ, పోర్ర్టెయిట్, వైల్డ్లైఫ్, సినిమాటోగ్రఫీ, ఫొటో జర్నలిజంపై మాస్టర్ క్లాసులు నిర్వహించారు.


