నాగపూర్: దేశ, విదేశాల్లో నెట్వర్క్ కలిగిన ఒక ఆన్లైన్ హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ను నాగపూర్ క్రైమ్ బ్రాంచ్ సామాజిక భద్రతా విభాగం (ఎస్ఎస్బీ)గుట్టురట్టు చేసింది. పోలీసులు పక్కా వ్యూహంతో దాడి చేసి, ఉజ్బెకిస్తాన్కు చెందిన ఇద్దరు విదేశీ మహిళలతో సహా మొత్తం ఐదుగురు బాధితురాళ్లను రక్షించారు. ఈ దందా నిర్వహిస్తున్న సచిన్ మాణిక్రావ్ మహాజన్ (38) అనే దళారీని అరెస్ట్ చేశారు. అయితే, ఈ రాకెట్ ప్రధాన సూత్రధారులు సమీర్ (అలియాస్ మనీష్/గగన్ ఠాకూర్), రాహుల్, పూజ అనే ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ‘లాగిన్ పర్సనల్ మీటింగ్’ పేరుతో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు దేశ, విదేశాల నుండి మహిళలను రప్పించి వ్యభిచార దందా సాగిస్తున్నారు. ఈ నెట్వర్క్ గురించి సమాచారం అందుకున్న సామాజిక భద్రతా విభాగం పోలీసులు విటుల రూపంలో నిందితులను సంప్రదించారు. నాగపూర్లో మహిళలు కావాలని యాప్ ద్వారా తెలియజేయగా, నిందితులు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు డిమాండ్ చేశారు.
నిందితుడు సచిన్ మహాజన్ ఒక స్విఫ్ట్ డిజైర్ కారులో ఉజ్బెకిస్తాన్ మహిళను తీసుకుని రాగా, పొంచివున్న పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితురాలిని విచారించగా, తాను ఉజ్బెకిస్తాన్ పౌరురాలినని, సమీర్ ఠాకూర్ చెప్పడం వల్లే ఇక్కడికి వచ్చానని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పరిసరాల్లోని హోటళ్లపై దాడులు చేసిన పోలీసులు.. ఢిల్లీ, పంజాబ్, కోల్కతా ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు మహిళలతో పాటు మొత్తం ఐదుగురిని రక్షించి ‘కరుణ సుధార్’ గృహానికి తరలించారు. ఈ దాడిలో పోలీసులు రూ. 8,000 నగదు, మొబైల్ ఫోన్లు, స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అంబాజరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.


