ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపునకు బ్రేక్! | EPFO Wage Limit Hike Halted Relief for Firms Setback for Workers | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపునకు బ్రేక్!

Jul 14 2026 10:00 AM | Updated on Jul 14 2026 11:31 AM

EPFO Wage Limit Hike Halted Relief for Firms Setback for Workers

లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గరిష్ట వేతన పరిమితి పెంపు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలిసింది. ఈపీఎఫ్ శాతాన్ని లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ.15,000ల నుంచి రూ.25,000లకు పెంచాలనే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు సమాచారం. కొత్త సామాజిక భద్రతా కోడ్ అమలు నేపథ్యంలో వేతన పరిమితి దాదాపు రెట్టింపు అవుతుందని ఆశించిన ఉద్యోగ వర్గాలకు ఈ నిర్ణయంతో ప్రస్తుతానికి నిరాశే ఎదురవుతుందని కొందరు భావిస్తున్నారు.

నేపథ్యం.. ప్రస్తుత విధానం

దేశంలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతను నిర్ణయించడంలో ఈ వేతన పరిమితి అత్యంత కీలకమైనది. చివరిగా 2014లో ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000లకు పెంచారు. ఆ తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ పరిమితిని కనీసం రూ.21,000 లేదా రూ.25,000లకు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాజా సమీక్షలో ప్రభుత్వం పాత రూ.15,000 పరిమితినే ప్రస్తుతానికి కొనసాగించాలని చూస్తోంది.

నిర్ణయం వాయిదాకు గల కారణాలు

ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, వేతన పరిమితిని ఒకేసారి రూ.25,000లకు పెంచడం వల్ల ప్రభుత్వంపై, కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ పథకానికి (ఈపీఎస్‌) కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 1.16% అదనపు సబ్సిడీని అందిస్తుంది. పరిమితి పెరిగితే ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాల్సిన నిధులు భారీగా పెరుగుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉద్యోగుల పీఎఫ్ వాటా కోసం అదనపు నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఇది వారి వ్యాపార నిర్వహణ వ్యయాన్ని ప్రభావితం చేస్తుంది.

ఉద్యోగులపై ప్రభావం

నిబంధన (పరిమితి)ఉద్యోగి వాటా (12%)యాజమాన్యం ఈపీఎస్‌ వాటా (8.33%)ఈపీఎఫ్‌ వాటా (3.67%)
ప్రస్తుత విధానం (రూ. 15,000)రూ. 1,800రూ. 1,250రూ. 550
ప్రతిపాదన (రూ. 25,000)రూ. 3,000రూ. 2,083రూ. 917

 

పరిమితి పెరగకపోవడం వల్ల ఉద్యోగుల నెలవారీ జీతాల్లో కోతలు పెరగవు. ఫలితంగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వారి చేతికి వచ్చే జీతం తగ్గకుండా ఉంటుంది. కానీ, నాణేనికి ఉన్న మరో వైపు చూస్తే.. రిటైర్మెంట్ నాటికి లభించే భారీ పీఎఫ్ నిధి, పెన్షన్ మొత్తాన్ని పెంచుకునే అవకాశాన్ని ఉద్యోగులు ప్రస్తుతానికి కోల్పోతారు. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాక కేంద్రం ఈ వేతన పరిమితి పెంపుపై పునరాలోచన చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement