యోగా గురు రామ్దేవ్ బాబా హిందూ రాష్ట్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన పూర్వీకులు ఒక్కరేనని, దేశంలో ముస్లింలకు లేదా క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, అందువల్ల 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ద్వారా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 60 ఏళ్ల ఈ యోగా గురువు, 2009లో ఉత్తరప్రదేశ్లోని తాను మదర్సాను సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ రామ్దేవ్ ఇలా అన్నారు: "హరిద్వార్ సమీపంలో డియోబంద్ ఉంది. మన మతాలు వేరుగా ఉండవచ్చు, కానీ మన పూర్వీకులు ఒక్కరే. 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనందరి పూర్వీకులు సనాతన హిందూ ఆర్య-వైదికులే. ఈ విషయం మన కళ్ల ముందే స్పష్టంగా ఉంది’’ అంటూ పెద్ద దుమారాన్నే రాజేశారు. హిందుస్థాన్లో
ముస్లింలకు గానీ, క్రైస్తవులకు గానీ ఎలాంటి ప్రమాదం లేదు అని ఆయన అన్నారు. అంతేకాదు ముస్లింలు తమ ఇష్టప్రకారం గడ్డం ఉంచుకోవడం, లేదా తీసేసుకోవచ్చన్నారు. అంతేకాదు , నచ్చిన దుస్తులు ధరించవచ్చని, కానీ తమ పూర్వీకుల లాంటి మంచి ప్రవర్తనను, సాంప్రదాయాలను అలవర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
మండిపడ్డ విపక్షాలు
రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రామ్దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అందరూ సనాతనులే అయితే, సమాజంలో ఇన్ని విభజనలు సృష్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అందరినీ సమానంగా అంగీకరించకుండా విడదీయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తించారు.
దేశం కేవలం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని, భారతదేశాన్ని 'హిందూ రాష్ట్రం' అని ఎవరు ప్రకటించారని AIMIM వారిస్ పఠాన్ ప్రశ్నించారు. ముస్లింలు ఎవరికీ భయపడరని, రాజ్యాంగానికి లోబడే జీవిస్తారని చెబుతూ, ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు.
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ఇలాంటి వారిని తెరపైకి తెచ్చి 'హిందూ రాష్ట్రం' గురించి మాట్లాడిస్తోందని సమాజ్వాదీ పార్టీ నేత ఫఖ్రుల్ హసన్ చాంద్)ఆరోపించారు.
మనది అన్ని మతాలకు సమాన గౌరవించే లౌకిక దేశమని ఎన్సీపీ నేత నసీమ్ సిద్దిఖీ గుర్తుచేశారు. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని, ఆచారాలను అనుసరించే స్వేచ్ఛ ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు, సోదరభావానికి ముప్పు కలిగిస్తాయని ఆయన ఖండించారు.


