డీఎస్సీ పోస్టులు అక్రమార్కులకు కట్టబెట్టారు | DSC Aspirants Protest At Dharna Chouk | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పోస్టులు అక్రమార్కులకు కట్టబెట్టారు

Jul 7 2026 5:20 AM | Updated on Jul 7 2026 5:20 AM

DSC Aspirants Protest At Dharna Chouk

నిరాహార దీక్షలో పాల్గొన్న గెరివి అంజినప్ప, వికలాంగుల హక్కుల వేదిక నాయకులు

అర్హులకు అన్యాయం చేశారు.. అర్హత సాధించామని ఆధారాలతో నిరూపిస్తాం 

అర్హులకు న్యాయం చేయలేనప్పుడు లోకేశ్‌కు మంత్రి పదవి ఎందుకు? 

విజయవాడ ధర్నా చౌక్‌లో డీఎస్సీ బాధితుల నిరవధిక నిరాహార దీక్ష

సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025లో టీచర్‌ పోస్టులను అక్రమార్కులకు కట్టబెట్టి అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందని అర్హత ఉన్నా ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ, ఉద్యోగాలు రాని బాధిత అభ్యర్థులు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దివ్యాంగుడు గెరివి అంజినప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉడదల ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

వీరికి ఇతర డీఎస్సీ అభ్యర్థులు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. తమకు న్యాయం చేసి, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. పేదలకు, అర్హులకు న్యాయం చేయలేనప్పుడు మంత్రి పదవి ఎందుకు అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు.

డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ఉద్యోగాలను పప్పు బెల్లాల్లా అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, న్యాయం కోసం నిలబడితే జైళ్లకు పంపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి సోదరుడు, టీడీపీ కార్యకర్త ఉడదల శివ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు హెచ్‌.వసంత్‌ కుమార్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర, దివ్యాంగ విభాగం అనంతపురం జిల్లా కార్యదర్శి బోయ రాజేష్‌ తదితరులు ప్రసంగించారు.

నేను ఫేక్‌ కాదు.. నిరూపిస్తా 
పది నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయా. నా ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చా. దివ్యాంగుడినైన నాకు విద్యాశాఖ మంత్రి లోకేశ్, అధికారులు చాలా అన్యాయం చేశారు. ఐఏఎస్‌ అధికారులంతా నేను ఫేక్‌ అని ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిరూపిస్తా. మరి అసలు అర్హతే లేని కురువ శ్రీనివాసులుకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? మంత్రి లోకేశ్‌ను కలిసినా న్యాయం జరగలేదు. కొందరు అధికారులు కోర్టులకు కూడా తప్పుడు సమాచారం పంపుతున్నారు.                   – గెరివి అంజినప్ప, దివ్యాంగుడు, డీఎస్సీ బాధితుడు, సత్యసాయి జిల్లా

డీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చినా... 
నాకు డీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చింది. గెరివి అంజినప్పది పీహెచ్‌ కోటాలో ఉద్యోగం పోయినందువల్ల హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వల్ల నా ఉద్యోగం పోయిందని చెప్పారు. కానీ అది బీసీ–ఏ కోటా. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వల్ల కాదు అధికారుల మోసం వల్లే పోయిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మా కుటుంబమంతా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాం. మంత్రి లోకేశ్‌ను మూడుసార్లు కలిశాం. భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డిని కలిస్తే నాలుగు రోజులు ఆగండి జాబ్స్‌ ఇప్పిస్తామన్నారు. మాకు అర్హత ఉందని అందరికీ తెలిసినా, మేము ఫేక్‌ అని మాట్లాడుతున్నారు.     – ఉడదల ప్రభావతి, డీఎస్సీ అభ్యర్థని, గుంతకల్లు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement