సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం తమ జేబు సంస్థగా మార్చుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిందన్నారు. ఇదే సమయంలో సింగరేణి కార్మికులపై ఆదాయపు పన్ను భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
భూపాలపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సింగరేణి కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంస్థ ప్రస్తుతం కష్టనష్టాల్లో ఉంది. కేసీఆర్ పాలన వల్ల సింగరేణి 15 సంవత్సరాలు వెనుకబడింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దేశంలో ఎక్కడా లేని సమస్యలు సింగరేణిలో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కరోజైనా సింగరేణి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించరా?. సింగరేణిని కేసీఆర్ కుటుంబం తమ జేబు సంస్థగా మార్చుకున్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంంది. వాళ్ల తాత జాగీరు అన్నట్లు గత ప్రభుత్వం, తాజా ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి.
బొగ్గు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, బొగ్గు లేకపోతే దేశం ఒక్కరోజు కూడా ముందుకు సాగదు. కేసీఆర్ హయాంలో జెన్కోకు రూ.8,958 కోట్ల అప్పు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ రెండున్నరేళ్లలో మరో రూ.26,875 కోట్ల అప్పు చేసింది. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు.
కర్ణాటకకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్లో సుమారు 434 మిలియన్ టన్నుల గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీనివల్ల సింగరేణికి రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశముందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ మంత్రులే రెండు వర్గాలుగా విడిపోయి వాటాల కోసం గొడవపడ్డారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం కోసం సింగరేణి నుంచి రూ.500 కోట్లు తీసుకున్నారని, మెస్సీ ఫుట్బాల్ కార్యక్రమానికి కూడా సింగరేణి నిధులను వినియోగించారని విమర్శించారు.


