న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని వివాదాస్పద ధార్ భోజశాల ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి భోజశాల ప్రాంగణం లోపల నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా దానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ముస్లిం పక్షానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు, భద్రత పర్యవేక్షించాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్లకు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భోజశాల అత్యంత సున్నితమైన అంశమని, రెండు వర్గాలు సంయమనం పాటించాలని సూచించింది. అవసరమైతే ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించేందుకు సిద్ధమని పేర్కొంది. గతంలో ఈ కాంప్లెక్స్ సరస్వతి ఆలయమేనని స్పష్టం చేస్తూ, అక్కడ నమాజ్ చేసుకోవచ్చన్న దశాబ్దాల నాటి ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ: మూడో భాష ఫెయిలైతే టెన్త్ సర్టిఫికెట్ రాదు!


