టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలక ఆదేశాలు జారీ చేశారు.
అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా పర్సనాలిటీ రైట్స్, కమర్షియల్ ప్రయోజనాల కోసం గానీ, సొంత ప్రచారం కోసం గానీ వాడకూడదని థర్డ్ పార్టీలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు, ఇలాంటి అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలంటూ మెటా ఆన్లైన్ ప్లాట్ఫామ్తో పాటు ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆదేశించింది.
ఏం జరిగిందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుకుని కొందరు అభిషేక్ శర్మకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. దీనిని సవాల్ చేస్తూ అభిషేక్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజా విచారణలో ఇది అతని గౌరవానికి, బ్రాండ్ వాల్యూకు నష్టం కలిగించేలా ఉన్నాయని అభిషేక్ తరఫు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. కొంతమంది వెబ్సైట్లలో అతని మార్ఫింగ్ ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలతో టీ-షర్టులు, బట్టలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారని తెలిపారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఇలాంటి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం, అలాగే అతని పేరుతో అక్రమంగా దుస్తులు, వస్తువులు అమ్మడంపై నిషేధం విధించారు. అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడని, అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా గౌరవించాలని కోర్టు కోరింది. ఒక వ్యక్తికి పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉన్నప్పుడు, వారి అనుమతి లేకుండా వారి గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ పొందే హక్కు సదరు వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ నటీనటులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, పాడ్కాస్టర్ రాజ్ శమని వంటి ప్రముఖులు తమ పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాగే మధ్యంతర ఉపశమనాన్ని పొందారు.
ఇక అభిషేక్ శర్మ ప్రస్తుత టీమిండియా టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ నుంచి మంచి ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లలోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ బాగా ఆడినప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా క్లీన్స్వీప్కు గురైంది.
Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్తో బరిలోకి అర్జెంటీనా!


