ఢిల్లీ: నగరంలోని వినోద్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్య పుట్టినరోజు నాడే నడిరోడ్డుపై భర్త తుపాకీతో కాల్చి చంపాడు. 2023లో మనీష్ భాటి అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహం జరిగింది.నిందితుడు మనీష్.. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రియాంక పుట్టినరోజు కావడంతో, దంపతులిద్దరూ కలిసి రాత్రి రెండు గంటలకు బైక్పై బయటకు వెళ్లగా.. మార్గమధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ప్రియాంక బైక్ దిగి వెళ్లిపోతుండగా.. తుపాకీ బయటకు తీసి కాల్పులు జరిపి మనీష్ పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను గమనించిన ఓ డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 2024లో కట్నం కోసం మనీష్ భార్య ప్రియాంకను వేధింపులకు గురిచేశాడని.. ఆ సమయంలో సుమారు 8 నెలలు సోదరుడి ఇంట్లోనే ప్రియాంక ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.


