పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనాస్థలిలో పోలీసులు ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు‘ అని భారతి రాసినట్లు తెలుస్తోంది.
భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


