కుక్కల్ని చంపే ఇంజెక్షన్‌ ఎక్కించి ఏవో హత్య..! | Agriculture Officer Srihari Death Incident In Nellore Over Property Dispute, Police Reveal Shocking Details | Sakshi
Sakshi News home page

కుక్కల్ని చంపే ఇంజెక్షన్‌ ఎక్కించి ఏవో హత్య..!

Jul 13 2026 9:15 AM | Updated on Jul 14 2026 3:43 PM

Agriculture Officer Srihari Incident in Nellore

నెల్లూరు జిల్లా: బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి (ఏవో) శ్రీహరి హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 15న జరిగిన ఈ ఘోర హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించి ఆధారాలు కాజేసే ప్రయత్నం చేయగా, తాజాగా పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో శ్రీహరిని ఆయన సొంత బావమరిది హరికృష్ణ పక్కా ప్రణాళికతో హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో హత్యకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  

పోలీసుల కథనం ప్రకారం.. ఏవో శ్రీహరి తన బావమరిది హరికృష్ణను అమితంగా నమ్మి కోట్ల విలువైన ఆస్తితో పాటు భారీగా అప్పుగా డబ్బులు ఇచ్చారు. అయితే, ఇటీవల శ్రీహరి తనకు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందని, తాను ఇచ్చిన ఆస్తిని, డబ్బును తిరిగి ఇవ్వాలని హరికృష్ణను కోరారు. ఆస్తిని తిరిగి ఇవ్వడం ఇష్టం లేని హరికృష్ణ.. బావను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. ఇందుకోసం రవీంద్ర, యానాది అనే ఇద్దరు వ్యక్తులను డబ్బు ఆశ చూపి నియమించుకున్నాడు.

జూన్ 15న దైవదర్శనం పేరుతో బావను నమ్మించి పెంచలకోనకు కారులో తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో చేజర్ల మండలం సమీపంలో కారును ఆపాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన రవీంద్ర, యానాదిలు కారులో ఉన్న శ్రీహరిని గట్టిగా పట్టుకోగా.. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే రెండు బలమైన ఇంజెక్షన్లను శ్రీహరికి బలవంతంగా గుచ్చాడు. ఆ ఇంజెక్షన్ల ప్రభావంతో శ్రీహరి కారులోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

హత్య అనంతరం దీనిని గుండెపోటుతో జరిగిన సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అనుమానాస్పద పరిస్థితులు, సేకరించిన ఆధారాల ఆధారంగా కేసును ఛేదించారు. ఈ కేసులో హత్యకు సహకరించిన రవీంద్ర, యానాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

సెల్ఫీ వీడియోతో తెరపైకి కొత్త అంశాలు 
ఈ క్రమంలో హరికృష్ణ పేరుతో విడుదలైన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తాను చనిపోతున్నానంటూ పేర్కొంటూ విడుదల చేసిన ఈ వీడియోలో తన వ్యక్తిగత విషయాలు, ఆస్తులు, అప్పుల వివరాలను ప్రస్తావించారు. తాను ఎవరికీ ఎలాంటి నష్టం చేయలేదని, తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.  వీడియో చివరలో తన భార్య, పిల్లల గురించి ప్రస్తావిస్తూ వారికి జాగ్రత్తలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సెల్ఫీ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందనే అంశంపైనా పోలీసులు దృష్టి సారించి, అతని కోసం గాలిస్తున్నారు. హరికృష్ణ పట్టుబడితే కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించే అవకాశం ఉంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement