మహిళలతో నృత్యాలు చేస్తున్న టీడీపీ నేతలు
మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల బరితెగింపు
అక్రమ దందాల సొమ్ముతో లాడ్జిలో జల్సాలు
మద్యం మత్తులో యువతులతో కలిసి చిందులు
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్
విచారణకు ఆదేశించిన ఎస్పీ
చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేతలు మట్టి అక్రమాలు, పేకాట శిబిరాలు, గంజాయి అమ్మకాలు, భూ దందాలతో చెలరేగిపోతున్నారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. లాడ్జిల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా నగరం నడిబొడ్డు ఉన్న ఓ లాడ్జిలో మద్యం తాగి యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్న టీడీపీ నేతల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులు ముగ్గురున్నారు.
వీరు మద్యం మత్తులో ఊగిపోతూ యువతులతో అశ్లీల నృత్యాలు చేశారు. వీడియోల విషయం తెలుసుకున్న ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు విచారణకు స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. రంగంలోకి దిగిన ఎస్బీ సిబ్బంది అశ్లీల నృత్యాలు చేసిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. మచిలీపట్నంలోని ఏ లాడ్జిని అద్దెకు తీసుకున్నారు? యువతులను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వీడియోలో కనిపించే టీడీపీ నేతలే కాకుండా పెద్ద నాయకులు ఇంకా ఏవరైనా ఉన్నారా? వంటి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.


