బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు నేడు వైఎస్ జగన్ పరామర్శ
సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం, అరకొర సాయంపై నిలదీయనున్న వైఎస్సార్సీపీ అధినేత
సాక్షి, విశాఖపట్నం: సముద్రం జీవనాధారం.. అదే సముద్రం ఆరుగురు మత్స్యకార కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన తొలి గంటల్లోనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న బాధ ఇప్పటికీ తీరప్రాంతంలో వినిపిస్తోంది. సహాయక చర్యల్లో జాప్యం, అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనలు, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు.. ఇవన్నీ బాధిత కుటుంబాల ఆవేదనను మరింత పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వారి బాధను పంచుకునేందుకు, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖకు రానున్నారు.
జబ్బర్తోటకు చెందిన గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్నాను వై.ఎస్.జగన్ ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది? సముద్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తోటి మత్స్యకారులను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఎలా ఒడ్డుకు చేరుకున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైతే తాను స్వయంగా విశాఖకు వస్తానని అప్పుడే భరోసా ఇవ్వగా.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించేందుకు వస్తున్నారు.
ఎయిర్పోర్టు నుంచి జబ్బర్తోటకు..
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిరిపురం, జగదాంబ జంక్షన్, టర్నర్ చౌల్ట్రీ, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజీ మార్గం మీదుగా రెల్లివీధి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి జబ్బరతోట వెళ్లనున్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
అరకొర సాయం.. ఆదుకుంటుందా..?
ఆరుగురు కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినా, అది వారి జీవితాలకు ఏమాత్రం సరిపోదని మత్స్యకార సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదానికి బాధ్యులెవరో తేల్చడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సముద్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాలను జగన్ తన పర్యటనలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకృతి వైపరీత్యానికి మించి.. ప్రభుత్వ నిర్లక్ష్యం
ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టాన్ని మరింత పెంచిందన్న భావన మత్స్యకారుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన రోజే సమాచారం అందిందని ఒక అధికారి చెబుతుండగా..మరుసటి రోజు ఉదయం వరకూ తమకు తెలియలేదని మరో అధికారి చెప్పడం.. అదే సమయంలో ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్లు వెళ్లాయని ఇంకో ప్రకటన రావడం ప్రభుత్వ సమన్వయ లోపాన్ని బట్టబయలు చేసింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి 4వ తేదీ రాత్రి 11.30 గంటలకే సమాచారం అందిందని వెల్లడించగా, మత్స్యశాఖ కమిషనర్ మాత్రం 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు తెలిసిందని చెప్పారు. మరోవైపు ఆర్డీవో దిలీప్ చక్రవర్తి మాత్రం ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్ పంపినట్టు ప్రకటించారు. చివరకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికలో మాత్రం బాధిత కుటుంబాలు 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొనడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. విలువైన గంటలు వృథా కావడం వల్లే గల్లంతైన వారిని కాపాడే అవకాశాలు కోల్పోయామని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.

గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదిక

ప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ రాత్రి 10.30 గంటలకే మత్స్యకార సంఘ నేత వాసుపల్లి జానకీరామ్ వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్కు సమాచారం.. ‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందన
నాడు మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వై.ఎస్ జగన్ మత్స్యకార సంక్షేమాన్ని ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చారు. వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10 వేల భరోసా అందించారు. డీజిల్పై అదనపు సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి దాదాపు రూ.3,800 కోట్లతో భారీ ప్రణాళికలు రూపొందించారు. ఆక్వా హబ్లు, రిటైల్ చేపల విక్రయ కేంద్రాల ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు కలి్పంచారు.
గతంలో అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగి్నప్రమాదంలో బోట్లు దగ్ధమైనప్పుడు కూడా జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. పూర్తిగా ధ్వంసమైన 49 బోట్లకు రూ.7.11 కోట్ల నష్టపరిహారం అందించడమే కాకుండా బోట్లపై ఆధారపడిన 400 మంది కారి్మకులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందించింది. హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు.
పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్కుమార్, మొల్లి అప్పారావు, పార్టీ సమన్వయకర్తలు జబ్బర్తోటలో బాధిత కుటుంబాల నివాస ప్రాంతాలను సందర్శించారు. వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, విమానాశ్రయం నుంచి జబ్బర్తోట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్మ్యాప్ను పరిశీలించారు.
ఓదార్పునిచ్చే ఆత్మబంధువు రాక కోసం..
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నలు, మత్స్యకారుల సమస్యలపై మరోసారి గళమెత్తడం..ఈ మూడు ప్రధాన అంశాల చుట్టూనే వై.ఎస్ జగన్ విశాఖ పర్యటన సాగనుంది. ఒకవైపు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూనే, మరోవైపు మత్స్యకారుల హక్కులు, భద్రత, సంక్షేమంపై ప్రభుత్వాన్ని నిలదీయనుండడంతో ఈ పర్యటనపై తీరప్రాంత ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తమ కష్టసుఖాల్లో అండగా నిలిచిన నాయకుడు మరోసారి తమ మధ్యకు వస్తుండడంతో విశాఖ తీరప్రాంతం ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది.
గతంలోనూ ఇదే తీరు..!
మత్స్యకారుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాలర్లు ఆరోపిస్తున్నారు. 2024లో మత్స్యకార భరోసా పథకం అమలు చేయకపోవడంతో పాటు, తర్వాత విడుదల చేసిన సాయాన్ని కూడా సగానికి తగ్గించిందని చెబుతున్నారు. ఇంకా అనేక మంది అర్హులకు భరోసా అందలేదని పేర్కొంటున్నారు. అలాగే, 2025 అక్టోబరులో బంగ్లాదేశ్లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారుల విడుదల విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపలేదని, మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం చేసిన ప్రయత్నాలతోనే వారు విడుదలయ్యారని, చివరి దశలో మాత్రం ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శిస్తున్నారు.
ఇన్చార్జినే దిక్కు..!
విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార కేంద్రం. వేలాది కుటుంబాల జీవనాధారమైన ఈ జిల్లాలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పోస్టు ఇప్పటికీ రెగ్యులర్గా భర్తీ కాలేదు. అనకాపల్లి జేడీ ఎల్బీఎస్ వర్ధన్కు ఈ నెల 4న అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో జేడీగా ఉన్న లక్ష్మణ్రావును ఎటువంటి కారణం లేకుండానే నెల్లూరుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన లేని ఇన్చార్జి అధికారితోనే శాఖను నడపడం వల్ల బోటు ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో ఆశించిన సమన్వయం కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో ఒత్తిళ్లు ఉండటంతోనే పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సకాలంలో రెగ్యులర్ జేడీని నియమించకపోవడం పరిపాలనా వైఫల్యమేనని మత్స్యకార సంఘాలు విమర్శిస్తున్నాయి.


