రాష్ట్రంలో మండిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు
మే నెలను మించి జూన్లో ద్రవ్యోల్బణం పెరుగుదల
అత్యధిక ద్రవ్యోల్బణంలో దేశంలోనే ఏపీ రెండో స్థానం
రాష్ట్రంలోని పట్టణాల్లో 4.89 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 5.71 శాతం ద్రవ్యోల్బణం
కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు అధికంగా ఉన్నాయి. మే నెలతో పోల్చితే జూన్లో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంతోపాటు ఆహార ద్రవ్యోల్బణం పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ(ఎంఎస్పీఐ) సోమవారం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది.
ఆ సూచిక ప్రకారం జూన్ నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ దరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు పెరిగినట్లు ఎంఎస్పీఐ వెల్లడించింది. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 5.39 శాతం ఉండగా, ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మే నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణం 4.90 శాతం ఉండగా, జూన్లో 5.39 శాతానికి పెరిగింది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 6.93 శాతం ఉండగా, జూన్లో ఏకంగా 8.18 శాతానికి చేరింది.

గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికం..
⇒ జూన్ నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5.71 శాతం, పట్టణాల్లో 4.89 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
⇒ జూన్లో జాతీయ సగటు సాధారణ ద్రవ్యోల్బణం 4.38 శాతం ఉండగా, ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతం ఉంది.
⇒ జాతీయ సాధారణ ద్రవ్యోల్బణం కన్నా రాష్ట్రంలోనే పట్టణాల సాధారణ ద్రవ్యోల్బణం(4.89శాతం), ఆహార ద్రవ్యోల్బణం(8.18 శాతం) అత్యధికంగా ఉంది.
⇒ మే నెలతో పోలి్చతే జూన్లో వంట నూనెలతోపాటు పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి.
⇒ ద్రవ్యోల్బణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. తమిళనాడు, మూడో స్థానంలో, ఒడిశా నాలుగో
స్థానం, మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి.
⇒ మే నెలలో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జూన్ నెలలో రెండో స్థానానికి చేరడం గమనార్హం.


