కబ్జాదారులకు ఎమ్మెల్యే అండ?.. జనసేనలో రచ్చ రచ్చ! | Differences In Visakhapatnam Dist Janasena Leaders | Sakshi
Sakshi News home page

కబ్జాదారులకు ఎమ్మెల్యే అండ?.. జనసేనలో రచ్చ రచ్చ!

Jul 14 2026 7:36 AM | Updated on Jul 14 2026 7:36 AM

Differences In Visakhapatnam Dist Janasena Leaders

డాబాగార్డెన్స్‌: విశాఖ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేపై మాజీ కార్పొరేటర్‌ సంచలన ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. కబ్జాదారులకు మద్దతుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు సిఫార్సు లేఖ రాశారని ఆ పార్టీ నేత పీతల మూర్తి యాదవ్‌ బాంబ్‌ పేల్చారు. నగరంలో సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ, జీవీఎంసీ ఆస్తులను కబ్జాదారులకు కట్టబెట్టేందుకు కొందరు అధికారులు తప్పుడు నివేదికలతో ఫైళ్లు కదుపుతుంటే, వారికి మద్దతుగా ఎమ్మెల్యే లేఖలు రాసినట్లు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో మూర్తియాదవ్‌ ఈ వ్యవహారంపై అధికారులకు వినతిపత్రం అందించి, సొంత పార్టీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టడం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను 
విశాఖలో కొందరు అవినీతి అధికారుల స్వార్థం వల్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుపరం అయిపోతున్నాయని మూర్తి యాదవ్‌ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న స్థలాలను కాజేసేందుకు ప్రయతి్నస్తున్న ప్రైవేటు వ్యక్తులకు స్వయంగా కూటమి ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో దశాబ్దాలుగా జీవీఎంసీ వినియోగంలో ఉన్న సర్వే నెంబరు 6/2 లోని ఎకరా 25 సెంట్ల విలువైన స్థలంపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందని, వేలాది మందికి నీరందించే ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, కార్యాలయం, సులభ్‌ కాంప్లెక్స్‌ ఉన్న ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఈ స్థలం తన సన్నిహితురాలైన ఎన్‌.వల్లికి చెందినదని, ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఈ నెల 9న మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణకు లేఖ రాయడంపై మూర్తియాదవ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కోర్టు తీర్పులను కాదని సిఫార్సులు 
ఇదే తరహాలో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో కోర్టు కేసుల్లో గెలిచి జీవీఎంసీ దక్కించుకున్న వాల్తేర్‌ వార్డు టౌన్‌ సర్వే నెంబరు 124, 125/2 లోని 3,660 చదరపు గజాల పార్కు స్థలాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయతి్నస్తున్నారని మూర్తి యాదవ్‌ ఆరోపించారు. అక్కడ లెండి వనం, బాబా చావిడి పార్కులు ఉన్నాయని, గతంలో ఈ స్థలం జీవీఎంసీదేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, సదరు స్థలం తనకు తెలిసిన విజయలక్ష్మికి చెందినదంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రికి మరో లేఖ రాయడం గమనార్హమన్నారు. ఆ కుటుంబం అమెరికా, జైపూర్‌లో సెటిల్‌ అయిందని, మానవతా దృక్పథంతో ఆ స్థలాన్ని వారికి అప్పగించడమో లేదా నష్టపరిహారం ఇవ్వడమో చేయాలని ఎమ్మెల్యే కోరడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 

పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలి 
ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా ఉద్యానవనాలను కాపాడాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యే దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటాన్ని కూడా మూర్తి యాదవ్‌ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తక్షణమే జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు అడ్డుకట్ట వేసి, రూ.150 కోట్ల విలువైన జీవీఎంసీ స్థలాలను, పార్కులను కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని డిమాండ్‌ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడిపైనే మాజీ కార్పొరేటర్‌ ఈ స్థాయిలో బహిరంగంగా తిరుగుబావుటా ఎగరేయడం.. జన   సేన పారీ్టలో రేగుతున్న అంతర్గత ముఠా తగాదాలను తేటతెల్లం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే సొంత పార్టీ నేతల మధ్యే రూ.150 కోట్ల భూవివాదంపై ఇంతటి తీవ్రస్థాయిలో రచ్చకెక్కడం జిల్లా జనసేన శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement