మంచిర్యాల జిల్లా: ప్రేమించాను.. నిన్నే పెళ్లి చేసుకుంటానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతిని ఓ యువకుడు రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక యువతి ఉరేసుకు ని ఊపిరి తీసుకుంది. తన చావుకు యువకుడే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు తన చదువు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు గోనే వెంకటేశ్ రెండేళ్లుగా సదరు యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ కూడా వెంకటేశ్ను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. తన వెంట పడొద్దని ప్రాధేయపడ్డా వినకుండా పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించాడు.
దీంతో ఇరువురి కుటుంబ సభ్యులతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యువతి వెంట పడొద్దని సూచించారు. అయినా వెంకటేశ్ మానలేదు. అతడితోపాటు కుటుంబ సభ్యులు వేధించడంతో సోమవారం మధ్యాహ్నం ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యకు వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులే కారణమని, న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఐబీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఐలు ప్రమోద్రావు, నవీన్కుమార్, ఎస్సై భూమేశ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, నిందితుడు వెంకటేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


