సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం రేగింది. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏబీసీ సోదాలు చేపట్టింది. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో రవీందర్ ఇళ్లతో పాటు బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లు.. 15 చోట్ల సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు.
ఏసీబీ సోదాల్లో రవీందర్ అక్రమాస్తులు ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, ఎకరాల కొద్దీ భూములు బయటపడుతున్నాయి. మసీద్బండలో భారీ నాలుగంతస్తుల భవనాన్ని ఏసీబీ గుర్తించింది. నానక్రామ్గూడలోని విలాసవంతమైన 'సుమధుర ఆక్రోపోలిస్'లో త్రీ-బీహెచ్కే ప్లాట్. ప్రముఖ ప్రాజెక్ట్ 'శ్రీవారి మెడోస్'లో ఒక ప్లాట్.. ప్రెస్టీజియస్ 'వాసవి అట్లాంటిస్'లో ఏకంగా మూడు ప్లాట్లును రవీందర్ కొనుగోలు చేశారు.
శంషాబాద్, షాబాద్ పరిధిలో నాలుగు ఎకరాల భూమి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏకంగా 7 ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐటీ హబ్ కొండాపూర్లో మరో రెండు లగ్జరీ ఫ్లాట్లు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్ ఇంట్లో అర కిలో బంగారం, భారీగా వెండి వస్తువులు గుర్తించిన ఏసీబీ.. రూ.10 లక్షల విలువైన అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సీజ్ చేవారు. అవినీతి అధికారి రవీందర్ పేరిట ఉన్న నాలుగు కీలక బ్యాంక్ లాకర్లు గుర్తించారు. 18 బాటిళ్ల విదేశీ మద్యం రవీందర్ ఇంట్లో లభించాయి. ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణ చేపట్టారు.


