సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) నియామకాల వ్యవహారంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిగ్రీలో కనీసం ఏడాదిపాటు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలన్న నిబంధన ఉన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ (ఆరు నెలలు) మాత్రమే ఆ సబ్జెక్టును చదివిన అభ్యర్థులను అర్హు లుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది.
అభ్యర్థుల అర్హత వివా దంపై వై.జగదీష్ తదితరులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. బీటెక్ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివారని చెప్పారు. రాతపరీక్షలో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ మెరిట్ సాధించినప్పటికీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో టీజీపీఎస్సీ వీరిని అనర్హులుగా ప్రకటించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సెమిస్టర్ విధానంలో ఏడాది సిలబస్ను ఆరు నెలలకే కుదించి బోధిస్తారని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ అకడమిక్ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిందని వాదించారు.
నిపుణుల కమిటీ నివేదికే కీలకం
నిబంధనల్లో స్పష్టంగా ’ఒక ఏడాది’ అని పేర్కొన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ మాత్రమే చదివితే ఆ నిబంధనను ఎలా సంతృప్తి పరుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ అకడమిక్ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. ఒక విద్యా సంవత్సరం అనగా 12 నెలలు లేదా రెండు సెమిస్టర్లు అని, ఫౌండేషన్ కోసం కేవలం ఆరు నెలలు చదివిన సబ్జెక్టును పూర్తి అకడమిక్ ఇయర్లో చదివినట్లుగా పరిగణించలేమని కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. అకడమిక్ అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయమని, వారి అభిప్రాయాన్ని కాదని న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను రుద్దలేవని జస్టిస్ మనోజ్ మిశ్రా స్పష్టం చేశారు.


