రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో చూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్–ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అక్కడి ఆటోమేటిక్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ క్షణాల్లో స్పందించింది. టన్నెల్లో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో టన్నెల్లో ఉన్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అయితే ప్రమాదాన్ని గుర్తించేందుకు మనుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. టన్నెల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ వెంటనే పనిచేసింది. మంటలు గుర్తించిన వెంటనే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయి నీటిని వెదజల్లాయి. దీంతో మంటలు పెద్దగా వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే మంటల కారణంగా వెలువడిన పొగతో కొంతసేపు టన్నెల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.
A car caught fire today inside the Airport Tunnel on the Gurugram–Dwarka Expressway, filling the tunnel with smoke.
As visibility dropped, vehicles halted outside the tunnel, while the tunnel's automatic fire safety system activated immediately, switching on the sprinklers. The… pic.twitter.com/MfmL8Ouavb— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2026
టెక్నాలజీ ఉంటే ఎంత తేడా?
సాధారణంగా టన్నెల్లలో అగ్నిప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైనవి. పరిమిత స్థలం, పొగ వేగంగా వ్యాపించడం, అత్యవసర సమయంలో బయటకు రావడంలో ఇబ్బందులు కారణంగా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించడం వల్ల మంటలు విస్తరించకుండా అడ్డుకోవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంటలు చెలరేగిన వెంటనే టన్నెల్ సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ కావడం, స్ప్రింక్లర్లు పనిచేయడం చూసి.. అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీ ఎంత కీలకమో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


