భర్త, ఆడపడుచు కట్న వేధింపులను భరించలేక నవవివాహిత ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు కామాక్షీపాళ్య పోలీస్స్టేషన్ పరిధిలో శ్వేత (25) మృతురాలు. చిక్కమగళూరుకు చెందిన శ్వేతకు, స్థానికుడు మూర్తితో పెళ్లయింది. పెద్దమొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. హెగ్గేనహళ్లి క్రాస్లో అద్దె ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు. శ్వేత ప్రైవేటు టీచరుగా పనిచేసేది. మరింత కట్నం తేవాలని భర్త, బంధువులు ఆమెను సతాయించేవారు. ఆదివారం ఉదయం రగడ జరగ్గా, శ్వేత తాను ఇక్కడ ఉండలేనని, పీజీ హాస్టల్లో ఉంటానని చెప్పి వెళ్లిపోయింది. ఆమె తల్లి ఫోన్ చేసి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 2:30కు ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి తన బాధను పేపరుపై రాసిపెట్టి, ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వారిని వదలిపెట్టకండి
తన చావుకు తన భర్త, అతడి అక్క కారణమని వారు నాకు చిత్రహింసలకు గురిచేశారని, వారి వల్ల విరక్తి చెందానని, నేను చనిపోయినా వారిని మాత్రం వదిలిపెట్టద్దు అమ్మ, నా వల్ల తప్పు జరిగింది, క్షమించు, ఇట్లు, ప్రేమతో, మీ కుమార్తె అని గుండెలోని ఆవేదనను డెత్నోట్లో రాసింది. 4 నెలల కిందటే ఘనంగా పెళ్లిచేశామని, తన కూతురిని చంపేశారని తల్లి రోదించింది. భర్త మూర్తి, సోదరి నరసమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్వేత (ఫైల్) బెంగళూరు:


