పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా భారతదేశం అడుగులు వేస్తోంది. 2070 నాటికి ‘నెట్-జీరో’ (నికర-సున్నా ఉద్గారాలు) లక్ష్యాన్ని చేరుకోవడానికి అణుశక్తి రంగంలో రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. దేశీయంగా పరిశోధనలు పెంపొందించడం, అవసరమైన యురేనియం దిగుమతి చేసుకోవడం, అణు, సౌర ఇంధన వనరులను వేగంగా విస్తరించడం ద్వారా ఈ రంగంలో స్వయంసమృద్ధి సాధించేందుకు పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షను పూర్తి చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ చీఫ్ మేధా విశ్రామ్ కుల్కర్ణి దీనికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు.
దేశీయ పరిశోధనలకు పెద్దపీట..
ఈ సన్నాహక రోడ్మ్యాప్లో భాగంగా భారతదేశం తన స్వదేశీ అణు సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అణు రియాక్టర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం భారీగా నిధులను పరిశోధనలకు కేటాయిస్తున్నారు. అణు ఇంధన లభ్యతపై ఉన్న పరిమితులను అధిగమించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను భారత్ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా భారతదేశానికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి యురేనియం దిగుమతులు చేసుకోవడానికి మార్గం సుగమం కావడం ఈ రోడ్మ్యాప్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది. అంతవరకు దేశీయ ఖనిజ నిల్వలపై ఆధారపడుతూనే విదేశీ యురేనియం సహాయంతో ఇంధన గ్రిడ్ను మరింత బలోపేతం చేయనున్నారు.
థర్మల్ పవర్కు ప్రత్యామ్నాయంగా అణు, సౌర శక్తి
పర్యావరణానికి ముప్పుగా మారిన బొగ్గు ఆధారిత ఉద్గారాలను తగ్గించేందుకు అణు విద్యుత్ను బేస్లోడ్ (స్థిరమైన విద్యుత్ సరఫరా) వనరుగా మార్చాలని నీతి ఆయోగ్, వివిధ నిపుణుల కమిటీలు సూచించాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం, సౌర లేదా పవన శక్తితో గ్రిడ్ను సమతుల్యం చేయడం కంటే అణు విద్యుత్ రంగాన్ని భారీగా విస్తరించడం వల్ల వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే కరెంట్ లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2070 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని భారీ స్థాయికి (సుమారు 331 గిగావాట్లకు) చేర్చడం ద్వారా దేశీయ ఇంధన అవసరాల్లో అణుశక్తి వాటాను పెంచనున్నారు. సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వేగవంతమైన విస్తరణకు తోడుగా నిరంతరం విద్యుత్ అందించే అణుశక్తిని అనుసంధానించనున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట


