వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతియుత వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. పరిస్థితులు కొద్దిగా కుదుట పడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద భారీగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు.
ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభించడానికి ప్రధాన కారణం టెహ్రాన్ అణుబాంబు తయారు చేస్తోందనే ఆరోపణ. ఆ దేశానికి గనుక అణ్వాయుధాలు అందితే అది అత్యంత ప్రమాదమని అమెరికా దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు చెందిన అణ్వాయుధ తయారీ కేంద్రాలపై అమెరికా పలుమార్లు దాడులు చేసింది. కాగా ట్రంప్ తాజాగా మరోసారి అణుబాంబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లో అమెరికా స్వాధీనం చేసుకొని తీరుతుందని ప్రకటించారు.
ట్రంప్ మాట్లాడుతూ.. "మాకు అది అవసరం లేదు. కానీ మేము అది పొందుతాం. మాకు అది కావాలి. దానిని మేము పొందిన తర్వాత పూర్తిగా వినాశనం చేస్తాం. కానీ ప్రస్తుతం అది మాకు కావాలి" అని ట్రంప్ అన్నారు.ఇరాన్లోని యురేనియం నిల్వలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ వద్ద దాదాపు 900 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా గతేడాది జరిపిన దాడుల్లో ఆ నిల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వాదిస్తున్నారు.
మోజ్తాబా కీలక ప్రకటన
అయితే ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్లోని యురేనియం నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


