సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరైనా దూరంగా జరిగిపోతారు. కానీ ఎడారి ఓడగా పిలుచుకునే ఒంటెకు బతికి వున్న పామును తినిపించడం చూస్తే ఎవరైనా షాక్కు గురి కావాల్సిందే. శాకాహారి అయిన ఒంటె నోరు బలవంతంగా తెరిచి మరీ ఒక బతికున్న విషపూరితమైన పాములను వెనుక ఉన్న రహస్యం ఏంటి? అరబ్ దేశాల్లో తరతరాలుగా ఈ ఆచారం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ ప్రశ్నలను మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి.
రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెల కాపరులు ఈ వింత పద్ధతిని పాటిస్తారు. ఒంటెలకు 'హయాం' (Hayam) అనే ఒక రకమైన వ్యాధి వస్తుంది (ఇది సాధారణంగా ఈగలు, దోమల ద్వారా వచ్చే పరాన్నజీవి వ్యాధి). ఈ వ్యాధి వచ్చినప్పుడు ఒంటె శరీరం వేడెక్కి, ఆహారం తీసుకోవడం మానేస్తుంది. ఆ సమయంలో దానికి బ్రతికున్న విషసర్పాలను తినిపిస్తే, ఆ విషం వల్ల ఒంటె ఒంట్లోని రోగం నయమవుతుందని, దాని కళ్ల వెంట నీళ్లు వచ్చి వ్యాధి బయటకు పోతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. తరతరాలుగా ఈ పద్ధతిని పాటస్తున్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.
అసలు నిజం
ఒంటెలు కేవలం శాకాహారులు (Herbivores). అవి సహజంగా పాములను తినవు. పశువైద్య నిపుణుల ప్రకారం, బ్రతికున్న పామును తినిపించడం వల్ల ఒంటెకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా ఇది ఆ ఒంటె ప్రాణాలకే ప్రమాదం. పైగా జంతు హింస కిందికి వస్తుంది. ఒకవేళ ఆ చికిత్స తర్వాత ఒంటె బ్రతికినా, అది దాని స్వయం నిరోధక శక్తి వల్ల బ్రతికిందే తప్ప పాము వల్ల కాదు.
మన దేశంలో నాగపంచమి వంటి పండుగల సమయంలో పాములు పాలు తాగుతాయనే ఒక పెద్ద అపోహ ఉంది. పాములు క్షీరదాలు కావు, అవి సరీసృపాలు. వాటి శరీరంలో పాలను అరిగించుకునే శక్తి (Lactase enzyme) ఉండదు. పండుగలకు కొన్ని వారాల ముందు పాములవాళ్లు అడవి పాములను పట్టుకుని, వాటి విషపు పళ్లను పీకేసి, వాటికి ఆహారం, నీరు లేకుండా ఉంచుతారు. బాగా దాహంతో ఉన్న పాము, ఆకలి తట్టుకోలేక ఎదురుగా ఉన్న పాలను నీళ్లు అనుకుని తాగుతుంది. ఆ పాలు వాటి ఊపిరితిత్తుల్లోకి చేరి, ఇన్ఫెక్షన్ వచ్చి కొద్ది రోజుల్లోనే ఆ పాములు విలవిల్లాడుతూ చనిపోతాయి.
భారతదేశంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పాము కుడితే ఆసుపత్రికి వెళ్లేకంటే, సాంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంత్రగాళ్లు, నాటు నాటు వైద్యులు దగ్గరికి వెళ్లి మంత్రాలు వేయించడం, వేర్ల పసరు పూయించడం చేస్తుంటారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుంది. విషసర్పం కుట్టినప్పుడు ప్రాణాలను కాపాడగలిగేది కేవలం యాంటీ-స్నేక్ వెనమ్ (Anti-Snake Venom) ఇంజెక్షన్ మాత్రమే. కొన్నిసార్లు విషం లేని పాములు కుట్టినప్పుడు మంత్రగాళ్ల వల్ల నయమైందని ప్రజలు నమ్మి, నిజంగా విషమున్న పాము కుట్టినప్పుడు కూడా అక్కడికే వెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది నిర్ధారణ లేదు. ఇలాంటిమ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.


