టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన స్థావరాలను, అణు కేంద్రాలను వేగంగా పునర్నిర్మిస్తోంది ఇరాన్. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఇటీవలి నెలల్లో అమెరికా, ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో ధ్వంసమైన వంతెనల నుంచి క్షిపణి స్థావరాల వరకు పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఇరాన్ తిరిగి నిర్మించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఒక ఉపగ్రహ చిత్రాల సమాహారంలో.. పశ్చిమ ఇరాన్లోని కంగావర్ వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరానికి వెళ్లే ప్రవేశ రహదారి మార్చి తొలి రోజుల్లో జరిగిన దాడులతో దెబ్బతిన్నట్టు కనిపించింది. కొన్ని వారాల తర్వాత తీసిన చిత్రాల్లో, దాడుల వల్ల మూసుకుపోయిన అదే ప్రవేశ ద్వారం వరకు కొత్తగా తారు వేసిన రహదారి కనిపించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ సేకరించిన మరికొన్ని చిత్రాల ప్రకారం.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో అనుబంధం ఉన్న బందర్ అంజలి నౌకాశ్రయంలో జూలై తొలి వారం నుంచే పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
అమెరికా ఇటీవల జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల్లో మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించినట్టు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రాలు బయటకు రావడంతో, ఇరాన్ తన అణు మౌలిక వసతులను ఎంత వేగంగా తిరిగి పునరుద్ధరించగలదనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.
ఊహించిన దానికంటే వేగంగా..
అణు కేంద్రాల పునరుద్ధరణ సామర్థ్యంపై కొత్త అంచనాలు వెలువడుతున్నాయి. చాలా మంది నిపుణులు ఊహించిన దానికంటే వేగంగా ఇరాన్ కీలక అణు కేంద్రాలను తిరిగి అందుబాటులోకి తెస్తోంది. గతంలో అమెరికా లక్ష్యంగా చేసుకున్న పలుచోట్ల పునర్నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కొత్త చిత్రాలు సూచిస్తున్నాయి.
అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ.. దాడుల తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యంలో కొంత భాగాన్ని వేగంగా పునరుద్ధరించిందన్నారు. అయితే అణు కేంద్రాల మరమ్మతు వేగం కూడా ఇరాన్ పునరుద్ధరణ సామర్థ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.
అమెరికా గూఢచారి సంస్థల అంచనా ప్రకారం.. అలీ ఖమేనీ మరణం తర్వాత నాయకత్వంలో వచ్చిన మార్పులతో ఇరాన్ అణ్వాయుధ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముజ్తబా ఖమేనీ బహిరంగంగా అణ్వాయుధాల తయారీకి మద్దతు ప్రకటించకపోయినా, అలాంటి కార్యక్రమాల పట్ల ఆయన తన తండ్రికంటే ఎక్కువగా సానుకూలంగా ఉండవచ్చని అమెరికా గూఢచారి సంస్థలు భావిస్తున్నాయి.
అలీ ఖమేనీ మాత్రం మతపరమైన ఫత్వా ఆధారంగా అణ్వాయుధాలు నిషిద్ధమని బహిరంగంగా ప్రకటించేవారు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంచనాల్లో చాలావరకు యుద్ధానికి ముందు సేకరించిన సమాచారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కొన్ని పరికరాలను అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రం పికాక్స్ మౌంటెన్ ప్రాంతానికి తరలించింది.


