రెండు లక్షల మంది పరార్
పడవలెక్కి మంటలకు దూరంగా...
ఆర్కకాన్ (ఫ్రాన్స్): యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, స్పెయిన్లు కార్చిచ్చుల సమస్యతో అట్టుడికిపోతున్నాయి. రెండు దేశాల్లోనూ కనీసం రెండు లక్షల అరవై వేల మందిని మంటల నుంచి రక్షించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంటలను అదుపు చేయడం కష్టమైన నేపథ్యంలో శుక్రవారం ఫ్రాన్స్లోని బోర్డాక్స్, స్పెయిన్లోని మాడ్రిడ్ నగరాల పరిసరాల్లో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయి.
పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతోపాటు వాతావరణంలో వస్తున్న దీర్ఘకాలిక మార్పుల కారణంగా కార్చిచ్చులు చెలరేగిపోతున్నాయి. మంటలార్పేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలు దాని తీవ్రత ముందు నెరవేరడం లేదని స్పెయిన్ అగ్నిమాపక దళ సిబ్బందికి చెందిన కొందరు అధికారులు వాపోయారు. అట్లాంటిక్ సముద్రతీర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతంలో కార్చిచ్చుల నుంచి తప్పించుకునేందుకు పడవలు ఉపయోగించారని, గిరోండే, లాండెస్ ప్రాంతాల్లోనే సుమారు 1.97 లక్షల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారని, స్పెయిన్ మధ్యప్రాంతంలో ఈ సంఖ్య అరవై వేల వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కార్చిచ్చులను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని, అదృష్టవశాత్తూ ప్రాణనష్టమేదీ జరగలేదని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ నైరుతి దిక్కున కార్చిచ్చులు విశాలమైన ప్రదేశాన్ని సర్వనాశనం చేశాయని, ప్రస్తుతం అవి గిరోండి ప్రాంతంలోని బోర్డాక్స్ నగరం వైపు వెళుతున్నాయని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ నునేజ్ తెలిపారు. ఒక రోజు ముందు ఈ కార్చిచ్చు ఫెరెట్ ద్వీపకల్ప ప్రాంతంలో సుమారు 140 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి వ్యాపించిందని, ఫలితంగా గిరోండే ప్రాంతంలో లక్ష పదివేల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారని వివరించారు.
ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైనికులను రంగంలోకి దించాలని, పౌరులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్నోను ఆదేశించారు. సహాయక చర్యలకు సాయపడాల్సిందిగా యూరోపియన్ దేశాలను అరి్థంచామని, క్రొయేíÙయా, పోర్చుగీస్లు మంటలార్పేందుకు పనికొచ్చే విమానాలను పంపుతున్నాయని మాక్రాన్ వివరించారు. చెక్ రిపబ్లిక్, స్లొవాకియాలు రెంఉడ బ్లాక్హాక్ హెలీకాప్టర్లను పంపుతున్నట్లు తెలిపారు.
రంగంలో స్పెయిన్ సైనికులు...
స్పెయిన్లో కార్చిచ్చులను అదుపులోకి తెచ్చేందుకు వేల మంది సైనికులు ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లస్కా తెలిపారు. దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించామని చెప్పారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కార్చిచ్చులతో నాశనమైన ప్రాంతాలను, కమాండ్ సెంటర్ను శనివారం సందర్శించారు. గత దశాబ్దకాలంలో ఏటా సుమారు లక్ష ఎకరాల ప్రాంతం కార్చిచ్చులకు బలవుతుంటే ఈ ఏడాది అది మరో 30 వేల ఎకరాలు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.
రెండు వేర్వేరు ప్రాంతాల్లోని కార్చిచ్చులు మాడ్రిడ్ ప్రాంతంలో కలిసిపోవడంతో అక్కడ మంటల తీవ్రత పెరిగిందని, సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతం ప్రభావితమైందని స్థానిక అధికారి ఇసబెల్ డియాజ్ అయుసో తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే స్పెయిన్లో కార్చిచ్చుల కారణంగా సుమారు 130000 హెక్టార్ల విస్తీర్ణంలోని ప్రదేశం నాశనమైంది.


