ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల యువకుడు చందూ కార్కి తన అసాధారణ సంకల్పంతో చరిత్ర సృష్టించారు. ఏకంగా 18,554 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కాలినడకన పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిస్తున్నాడు. కేవలం యాత్ర చేయడమే కాకుండా, దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఆయన ఈ సాహసానికి పూనుకున్నారు. దాదాపు మూడేళ్ల కాలంలో 806 రోజుల పాటు ఆయన సాగించిన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆస్తికరంగా మారింది.
యాత్ర వెనుక అసలు లక్ష్యం
ఉత్తరాఖండ్లోని బెరీనాగ్ తహసీల్ పరిధిలోని మానిఖేత్ గ్రామానికి చెందిన చందూ కార్కి, అల్మోడాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భారతదేశాన్ని అత్యంత సన్నిహితంగా పరిశీలించాలని, ఇక్కడి సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలను స్వయంగా వీక్షించాలనే కోరికతో ఆయన ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 19, 2023న తన స్వగ్రామం నుండి ఈ అఖిల భారత పాదయాత్రను ప్రారంభించారు.
రికార్డు స్థాయిలో సాగిన ప్రయాణం
ఈ ప్రయాణంలో భాగంగా చందూ కార్కి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టేశారు. ఎక్కడా వాహనాలను ఆశ్రయించకుండా పూర్తిగా కాలినడకనే ప్రయాణించారు. కేవలం 806 రోజుల్లోనే 18,554 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన భిన్న సంస్కృతులు, భాషలు, జీవనశైలిని కలిగిన కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
పవిత్ర క్షేత్రాలు.. మహా యాత్రలు
ఈ సుదీర్ఘ యాత్రలో భాగంగా చందూ కార్కి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ చార్ధామ్లను దర్శించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను సందర్శించాడు. వీటితో పాటుగా హరిద్వార్ నుండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళ్ వరకు అలాగే ఏకంగా నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం వరకు అత్యంత కఠినమైన కావడి పాదయాత్రలను విజయవంతంగా పూర్తి చేశాడు.
ఎదురైన భయానక, కఠిన పరిస్థితులు
చందూకు ఈ పాదయాత్ర ఎప్పుడూ పూలబాటలా సాగలేదు. ప్రయాణంలో అనేకసార్లు జనావాసాలు లేని, కనీసం మనుషుల సంచారం కూడా లేని నిర్జన అడవులు, కొండ ప్రాంతాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు ఎలాంటి దుకాణాలు లేదా గ్రామాలు కనిపించలేదు. ఆ సమయంలో తన బ్యాగులో ఉన్న కొద్దిపాటి బిస్కెట్లు, నీళ్లతోనే రోజంతా గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. నేపాల్ పశుపతినాథ్ యాత్ర సమయంలో అత్యంత భయానక అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజల ఆప్యాయతలు - గుజరాత్ జ్ఞాపకాలు
దేశవ్యాప్తంగా తాను తిరిగిన ప్రాంతాలలో ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని చందూ చెప్పారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో తనకు లభించిన ఆతిథ్యం, ప్రజల ఆప్యాయత ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ ఉన్నప్పటికీ, భారతదేశ ఆత్మ మాత్రం ఒకటేనని ఆయన తన ప్రయాణ అనుభవాల ద్వారా గ్రహించానని అన్నారు.
భవిష్యత్ లక్ష్యాలు
కేవలం రికార్డుల కోసమే కాకుండా, భారత్-నేపాల్ దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెప్పడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమని చందూ స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి చేరువ చేస్తున్న ఆయన, భవిష్యత్తులో దేశవిదేశాలలో మరెన్నో సాహసోపేతమైన యాత్రలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


