వ్యవస్థీకృత నేరాలకు రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు
తప్పు చేస్తే సరీ్వస్ ప్రొవైడర్లపై 8 ఏళ్ల నిషేధం, రూ.5 కోట్ల జరిమానా
రెండు నెలల్లోనే కేసు దర్యాప్తు పూర్తి
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో రోజువారీ విచారణతో 3 నెలల్లో తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తదితర పరీక్షల నిర్వహణ సంస్థల ప్రతిష్టను, పబ్లిక్ పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను తీసుకొచ్చింది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన బిల్లు ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ఈ బిల్లు రూపొందించారు. ముసాయిదా బిల్లులో నేరస్తులకు విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చారు.
పెరిగిన శిక్షలు, జరిమానాలు
పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే శిక్షలను సెక్షన్ 10 (1) కింద మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సరీ్వస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించారు.
అక్రమాల్లో సరీ్వస్ ప్రొవైడర్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే సెక్షన్ 10(3) కింద వారికి విధించే కనీస జైలు శిక్షను 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచారు. వీరికి విధించే జరిమానాను రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు సవరించారు. పరీక్షల నిర్వహణ సంస్థ, సరీ్వస్ ప్రొవైడర్ తదితర సంస్థలు వ్యవస్థీకత నేరానికి పాల్పడితే చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. గతంలో ఉన్న 5 ఏళ్ల కనిష్ట శిక్షను తాజా బిల్లులో 7 ఏళ్లకు పెంచారు. ఈ తరహా నేరాలకు విధించే జరిమానాను రూ.కోటి నుంచి గరిష్టంగా రూ.10 కోట్లకు పెంచారు.
స్పెషల్ టాస్క్ ఫోర్స్తో దర్యాప్తు
కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్)ను ఏర్పాటు చేసేందుకు కొత్తగా సెక్షన్ 12(2)లో నిబంధన చేర్చారు. కేంద్రం ఈ ఎస్టీఎఫ్ను ఏర్పాటు చేస్తే దర్యాప్తు బాధ్యతను పూర్తిగా ఆ బృందమే నిర్వహిస్తుంది. కొత్తగా చేర్చిన సెక్షన్ 12ఏ ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నాటి నుంచి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎస్టీఎఫ్లకు కేసును అప్పగించిన తేదీ నుంచి కచ్చితంగా రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి.
కేసులను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో సెషన్స్ కోర్టు స్థాయిలో ’స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు’లను ఏర్పాటు చేయాలి. ఈ కోర్టుల్లో సాక్షుల విచారణను వాయిదాలు వేయకుండా ప్రతిరోజూ కొనసాగించాలి. చార్జిïÙట్ దాఖలు చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోపు విచారణ ముగించి తీర్పు వెలువరించాలి. చట్టం అమల్లోకి వచ్చేనాటికి పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేస్తారు. ఆ కేసులను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల్లోపు తీర్పు ఇవ్వాలి. కేసుల వాదనల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తాయి.
హైకోర్టులోనే అప్పీళ్లు
కొత్తగా చేర్చిన సెక్షన్ 12ఆ ప్రకారం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలపై కేవలం హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి. ఇతర ఏ కింది స్థాయి కోర్టుకూ అప్పీల్, రివిజన్ అధికారాలు ఉండవు. ఈ అప్పీళ్లను హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుంది. అప్పీల్ స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల్లోపు పరిష్కరించాలి. కింది కోర్టు తీర్పు వెలువడిన 30 రోజుల్లోపు అప్పీల్ దాఖలు చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే గరిష్టంగా 90 రోజుల వరకు హైకోర్టు అప్పీల్ను అనుమతిస్తుంది. 90 రోజుల తర్వాత ఎలాంటి అప్పీళ్లను స్వీకరించరు. బెయిల్ మంజూరు, తిరస్కరణ ఆదేశాలపై నేరుగా హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి.


