వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కు మద్దతు తెలిపి, డెమోక్రాట్ సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలకు కేటాయించిన వందలాది సమాఖ్య ఇంధన గ్రాంట్లను రద్దు చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కోర్టులో అంగీకరించింది. బైడెన్ హయాంలో మంజూరైన బిలియన్ల డాలర్ల నిధుల రద్దును సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించి ఈ నెలలో సమర్పించిన కోర్టు ధృవీకరణ పత్రంలో ఈ సంచలన వాస్తవం వెలుగు చూసింది.
ట్రంప్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ (డీఓఈ) రద్దు చేసిన మొత్తం 284 గ్రాంట్ల నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రాతిపదికనే తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల పనితీరు, చట్టపరమైన అంశాలు, ఖర్చుల తగ్గింపు లేదా ఇతర కార్యాచరణ కారణాల వల్ల ఈ నిధులను నిలిపివేయలేదని, కేవలం బ్లూ స్టేట్స్ (డెమోక్రాట్ల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలు)లో ఉన్నందువల్లే వాటిని రద్దు చేసినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపు రద్దు అయిన అన్ని ప్రాజెక్టులు డెమోక్రాట్ రాష్ట్రాలకే చెందిపవి కావడం గమనార్హం.
ఈ పరిణామంపై డెమోక్రాట్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఓట్లు వేయలేదనే కక్షతో పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ యంత్రాంగం నిలిపివేసిందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ధ్వజమెత్తారు. తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలోనా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం పూర్తిగా అమెరికా వ్యతిరేక చర్య అని సెనేటర్ ప్యాటీ ముర్రే, ప్రతినిధి మార్సీ కప్టర్ సంయుక్త ప్రకటనలో విమర్శించారు. కాగా, కోర్టు దాఖలు చేసిన పత్రాలకు, గతంలో ఇచ్చిన ప్రకటనలకు ఎలాంటి విరుద్ధత లేదని ఇంధన శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: జంతర్మంతర్లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు!


