సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రూ. 76,250 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చేశాయని, దీని ద్వారా ఏకంగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గొప్పలు చెప్పుకున్న ఎకోరెన్ గ్రూప్ అసలు స్వరూపం తాజాగా జరిగిన జీఎస్టీ దాడుల్లో బయటపడింది. ఎలాంటి వాస్తవ వ్యాపార కార్యకలాపాలు లేకుండా కేవలం కాగితాలపైనే సాగిన ఈ అక్రమాల బాగోతం అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది.
రూ. 64.5 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్ల మోసానికి (ఐటీసీ స్కామ్) పాల్పడినట్లు తేలడంతో ఆ కంపెనీ మేనిజింగ్ డైరెక్టర్ (ఎండీ) చంచల్గూడ జైలుపాలయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతున్న ‘పెట్టుబడుల’ డొల్లతనం ఒక్కసారిగా బద్దలైంది. ఈ కంపెనీతో ఒప్పందం చేసుకున్న తొలి రోజే తాము దీనిపై పలు సందేహాలు లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. నేడు జీఎస్టీ అధికారుల విచారణలో ఆ కంపెనీ మోసాలు బయటపడి, ఎండీ జైలుకు వెళ్లడంతో ఆ సంస్థ స్వభావం ఏమిటో ప్రజలందరికీ స్పష్టమైంది.
కంపెనీల పూర్వాపరాలపై కనీస స్థాయి బ్యాక్గ్రౌండ్ పర్యవేక్షించకుండా, కేవలం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి నకిలీ, అనుమానాస్పద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ ఇన్వాయిస్లు, అక్రమ మోసాలకు పాల్పడే సంస్థలతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడమేనా మీరు రాష్ట్రానికి తెచ్చిన అభివృద్ధి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం గ్రాండ్ ఫోటో షూట్లు నిర్వహించడం, చివరికి ఆయా కంపెనీల బాగోతాలు బయటపడి చంచల్గూడ జైలు పాలవడం కూటమి మార్కు పాలనకు నిదర్శనంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


