క‘మెషన్ల’ పంచాయితీ ! | Pressure from TDP alliance MLAs for percentages | Sakshi
Sakshi News home page

క‘మెషన్ల’ పంచాయితీ !

Jul 25 2026 4:08 AM | Updated on Jul 25 2026 4:08 AM

Pressure from TDP alliance MLAs for percentages

పర్సంటేజీలు తేలలేదు – పట్టాలెక్కని యంత్ర పరికరాల పంపిణీ   

ఇన్‌చార్జి మంత్రుల లాగిన్‌లోనే దరఖాస్తుదారుల జాబితాలు 

పర్సంటేజ్‌ల కోసం టీడీపీ కూటమి ఎమ్మెల్యేల ఒత్తిళ్లు 

పారదర్శకంగా పంపిణీ అంటూ కంపెనీలతో రాయబేరాలు 

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 2 నెలలు గడిచినా పట్టాలెక్కని ప్రాజెక్టు  

సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అవినీతికి ఆలవాలంగా తయారైంది. వరుసగా రెండో ఏడాదీ కమీషన్ల పంచాయితీ తేలక పట్టాలెక్కలేకపోతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు 2 నెలలు గడిచింది. కానీ ఇప్పటి వరకు పర్సంటేజ్‌లు తేలక పోవడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 

ఆది నుంచి ఆపసోపాలే.. 
చంద్రబాబు సర్కారు గద్దెనెక్కగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా ఏటా లక్ష మందికిపైగా వ్యక్తిగత పరికరాలు ఇస్తామంటూ గొప్పగా ప్రకటించింది. ఆచరణకు వచ్చే సరికి 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్ష మందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్‌సీ గ్రూపులకు వెయ్యి కిసాన్‌ డ్రోన్స్, క్లస్టర్‌ స్థాయిలో 100 కంబైన్డ్‌ హార్వస్టర్స్‌ ఇస్తామని ఆశ చూపి, చివరికి ఆర్థిక శాఖ కోతలతో రూ.129 కోట్లతో 25వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్‌లతో సరిపెట్టారు. 2025–26 సీజన్‌లో రూ.240 కోట్లతో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 1000, ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు 75 కిసాన్‌ డ్రోన్స్, సీహెచ్‌సీ లకు 164 హైకాస్ట్‌ మిషనరీ,1050 ట్రాక్టర్లతో పాటు 50వేలకు పైగా వ్యక్తిగత పరికరాలిస్తామని ప్రకటించగా కమీషన్ల పంచాయతీ తెగకపోవడం గతేడాది ఈ పథకం అటకెక్కిపోయింది. 

అమలుకాని మార్గదర్శకాలు 
గతేడాది బడ్జెట్‌తోనే ఈ ఏడాది కొనసాగించేలా మే 4న మార్గదర్శకాలు జారీ చేశారు.ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా లబ్దిదారులకు యంత్రాల యూనిట్‌ ధరలో 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. తొమ్మిది రకాల పరికరాలను ఈసారి సరఫరా చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా పవర్‌ టిల్లర్లు, రోటేవేటర్లు, హార్వెస్టింగ్‌ థ్రెషర్లు, పురుగు మందులు పిచికారీ చేసే స్ప్రేయర్లు ఉన్నాయి. వీటితో పటు నూరి్పడి యంత్రాలు, విత్తన గొర్రులు, ట్రాక్టర్‌తో పనిచేసే పరికరాలు, 40 హెచ్‌పీ వరకు సామర్థ్యం కలిగిన 2డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీ ట్రాక్టర్‌లను రైతులకు రాయితీపై అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

షెడ్యూల్‌ ప్రకారం మే 5 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత జిల్లా జాయింట్‌ కలెక్టర్ల సమక్షంలో మే 23–25వ తేదీ మధ్యలో లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. వారి నుంచి నాన్‌ సబ్సిడీ వాటా వసూలు చేసిన తర్వాత జూన్‌ 26వ తేదీ నుంచి యంత్రాలను కంపెనీల నుంచి నేరుగా డెలివరీ చేయాలి. క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్‌ అయ్యాయో లేదో పరిశీలన తర్వాత జూన్‌ 30 నుంచి సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు.  షెడ్యూల్‌ ప్రకారం మే 5 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అందిన దరఖాస్తుల ఆధారంగా రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ మేరకు మే 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. 

రెండు నెలలుగా ఇన్‌చార్జి మంత్రి లాగిన్‌లోనే 
దాదాపు ప్రతి జిల్లా నుంచి 5వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఇన్‌చార్జి మంత్రుల ఆమోదానికి పంపారు. అయితే వాటిని నియోజకవర్గాల వారీగా విభజించి స్థానిక ఎమ్మెల్యేల పరిశీలనకు పంపారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ పరికరాల పంపిణీలో అందిన కాడకి దండుకోవాలన్న ఆలోచనతో యూనిట్‌ అంచనా విలువలో కనీసం 15–20 శాతం వరకూ కమీషన్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కమీషన్‌లో ఎవరికి వారు తమకు మెజార్టీ వాటా కావాలని పట్టుబడుతున్నారని చెబుతున్నారు.  ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య కమీషన్‌ పంచాయతీ తేలకపోవడంతో దరఖాస్తులు రెండు నెలలుగా ఇన్‌చార్జి మంత్రి లాగిన్‌లోనే ఉండిపోయాయి. 

మెజార్టీ వాటా తమకే ఇవ్వాలంటూ కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా, మరికొంత మంది ఎమ్మెల్యేలు లబ్దిదారుల నుంచి సబ్సిడీలో వాటాల కోసం ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇలా ఎడాపెడా సంబంధిత మంత్రితోపాటు ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య కమీషన్‌ వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో ఈ పథకం అమలు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఏదేమైనా సీజన్‌ ప్రారంభమై 45 రోజులైనా పరికరాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement