సాక్షి, తాడేపల్లి: ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నా. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో మీ అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2026
తొలి ఏకాదశి ప్రాశస్త్యం
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయనీ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటాయి. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని నమ్మకం. అందుకే తొలి ఏకాదశిని వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు.


