ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు  | BJP-RSS canot run govt as personal fiefdom | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు 

Jul 26 2026 5:19 AM | Updated on Jul 26 2026 5:19 AM

BJP-RSS canot run govt as personal fiefdom

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజం  

విద్యార్థులు చేపట్టిన ఆందోళన పాలకవర్గానికి ఒక హెచ్చరిక  

నిరంకుశంగా వ్యవహరిస్తే పది రెట్లు తీవ్ర పరిణామాలు తప్పవు  

విద్యార్థులపై దాడులకు ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి  

న్యూఢిల్లీ:  ప్రభుత్వాన్ని సొంత జాగీరులా నడపొద్దని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లకు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ పాలకవర్గానికి ఒక హెచ్చరిక అని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన ధర్మేంద్ర ప్రధాన్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామం అని స్పష్టంచేశారు. విద్యార్థుల నిరసనను ప్రధాని మోదీ. 

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గతానికి’, భారతదేశ భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తు గతాన్ని ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తర్వాత రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ఆందోళన చేసిన విద్యార్థులను క్రూరంగా హింసించారని, వారికి ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు, వారిపై పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించడానికి అనుమతించినందుకు హోంశాఖ మంత్రి అమిత్‌ షానే ప్రత్యక్ష బాధ్యులు అని పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్‌ అంగీకరించదని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ప్రకటించారు.  

అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారు  
భారతదేశ విద్యా వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్‌ తన గుప్పిట్లోకి తీసుకుని, చెదపురుగుల మాదిరిగా దానిని లోపలి నుంచే డొల్లగా చేస్తోందని రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ చెదపురుగును తొలగించాలని తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను, దేశ భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల విజయమని అన్నారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారంటూ విద్యార్థులను ప్రశంసించారు. విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

భారత విద్యా వ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టు తొలగాలని చెప్పారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ విద్యా వ్యవస్థపై నేడు దాడులు జరుగుతున్నాయని, కొందరు కబ్జా చేస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యమం విద్యా వ్యవస్థలో అక్రమాలకు, నిరుద్యోగానికి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన అని వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థలు కనుమరుగైపోయాయని, అందుకే యువత రోడ్డెక్కుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ముమ్మాటికీ ప్రజలకు చెందినదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.  

ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది  
నీట్‌ పేపర్‌ లీక్‌ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని రాహుల్‌ అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత, సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన ప్రతి వర్గం కూడా తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు ముందు జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలో పాల్గొన్న వారిని రాహుల్‌ కలిశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement