గుర్తుంచుకోండి.. బొద్దింకతో పెట్టుకోవద్దు  | Abhijeet Dipke hailed Union Minister Dharmendra Pradhan resignation | Sakshi
Sakshi News home page

గుర్తుంచుకోండి.. బొద్దింకతో పెట్టుకోవద్దు 

Jul 26 2026 5:12 AM | Updated on Jul 26 2026 5:12 AM

Abhijeet Dipke hailed Union Minister Dharmendra Pradhan resignation

ప్రధాన్‌ రాజీనామా తర్వాత అభిజీత్‌ దీప్కే వ్యాఖ్య 

ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణన 

జంతర్‌మంతర్‌లో అంబరాన్ని తాకిన సంబరాలు 

విద్యార్థుల పేర్లు చదివి నివాళి అరి్పంచిన దీప్కే 

సాక్షి, న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. రాజీనామా వార్త తెలియగానే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనచేస్తున్న నిరసనకారులు ఒక్కసారిగా ఆనందడోలికల్లో మునిగారు. జాతీయజెండాలు చేతబూని కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఉద్యమంలో ప్రభుత్వంపై గెలిచామన్న ఆనందంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘విద్యార్థి శక్తి విజయం సాధించింది‘అంటూ హర్షధ్వానాలు చేశారు. నీట్‌ లీకేజీతో మనస్తాపంతో ఆత్మహత్యచేసుకున్న పరీక్షార్థులకు నివాళిగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సంబరాలు కొనసాగించారు. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం హోరెత్తిపోయింది. 

ఫోన్‌ కాల్‌తో ఒక్కసారిగా ఆనందం 
శనివారం తొలుత జంతర్‌మంతర్‌లో నిరసన కార్యక్రమంలో సీజేపీ చీఫ్‌ అభిజీత్‌ దీప్కే ఉన్న సమయంలోనే మంత్రి పదవికి ధర్మేంద్ర రాజీనామాచేసిన విషయం ఫోన్‌కాల్‌ ద్వారా తెలిసింది. ఈ ఘటన వివరాలను దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వీడియో షేర్‌ చేసి తెలిపారు. 3 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో దీప్కే ఫోన్‌ మాట్లాడటం పూర్తయ్యేలోపే అక్కడి విద్యార్థులకు విషయం తెల్సి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత దీప్కే మైక్‌తీసుకుని ‘మన విద్యార్థి శక్తి వరి్ధల్లాలి. మనం సాధించాం’అని బిగ్గరగా అరుస్తూ చర్చలు ఫలవంతమయ్యాయని ప్రకటించారు.దీంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. 

చేతులు పైకెత్తి విజయోత్సాహం వ్యక్తం చేశారు. వేదికపై ప్రదర్శించిన పోస్టర్‌లో నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థుల పేర్లను దీప్కే చదివి వినిపించారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ, వారి త్యాగాలను ఉద్యమం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. షారుఖ్‌ఖాన్‌ హిట్‌ సినిమా ఛక్‌దే ఇండియాలోని దేశభక్తి పాటలను అక్కడ ప్లే చేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలను ప్రదర్శించారు.  

సీజేఐ సూర్యకాంత్‌కు థాంక్యూ.. 
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దిప్కే ప్రసంగించారు. ‘‘ధర్మేంద్ర రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయం. గుర్తుంచుకోండి బొద్దింకలతో పెట్టుకోవద్దు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అంత సులభం కాదు. కానీ విద్యార్థుల ఐక్యతతో ఇది సాధ్యమైంది. ప్రపంచం వంగుతుంది. కానీ దానిని వంచే సామర్థ్యం, నాయకత్వం మనకుండాలి. మీరు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ఎవరినైనా రాజీనామా చేయించవచ్చు అని ఈ ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల ఐక్యత ముందు ప్రభుత్వం తలవంచింది’’ అని అన్నారు.

 ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌కు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరే గనక మమ్మల్ని బొద్దింకలు అని పిలవకపోయి ఉంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేవాడినే కాదు. మీరే గనక మమ్మల్ని కాక్రోచెస్‌ అని పిలవకపోయి ఉంటే దేశ యువత వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టేదేకాదు. మీరేగనక కాక్రోచ్‌ అని పిలవకపోయి ఉంటే ఈరోజు ధర్మేంద్ర మంత్రిగా రాజీనామా చేసేవాడేకాదు. ఇవన్నీ సుసాధ్యంకావడానికి పరోక్షంగా మీ కాక్రోచ్‌ వ్యాఖ్యలే కారణం. అందుకే మీకు కృతజ్ఞతలు’’ అని దీప్కే అన్నారు.  

వాంగ్‌చుక్‌కు థాంక్యూ చెప్పని దీప్కే! 
తాము ఘన విజయం సాధించామని నిరసన వేదికపై నుంచి ప్రకటించిన సందర్భంగా దీప్కే చేసిన ప్రసంగంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ పేరును ప్రస్తావించలేదు. కనీసం థాంక్యూ చెప్పలేదు. వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షతోనే తొలుత నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం తర్వాత ఉద్యమంగా ఉధృతరూపం దాల్చింది. అలాంటి వాంగ్‌చుక్‌ను దీప్కే తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో ఉద్యమనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే కొత్త చర్చ మొదలైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే వాంగ్‌చుక్‌ పేరును దీప్కే ప్రస్తావించలేదనే వాదనా విని్పస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా దీప్కే ప్రసంగంలోని మాటలు ఉండటం గమనార్హం. ‘మన డిమాండ్లు నెరవేరడంతో నన్ను హీరోను చేసేయకండి. కేవలం ఒక్క వ్యక్తిని హీరోను చేస్తూ పోవడంతోనే ఇప్పుడు భారత్‌ ఇలా అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి తప్పును మీరు చేయొద్దు’’ అని దీప్కే అన్నారు.

ఇప్పుడే సూర్యోదయమైంది 
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ను దీప్కే చెప్పారు. ‘‘మోదీజీ. ప్రజాస్వామ్యానికి ఇప్పుడే సూర్యోదయం అయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే తొలి వికెట్‌ పడింది. మా ఉద్యమ ప్రయాణం మరెంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని అందరూ మాతో చెప్పేవారు. కానీ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని మేము నిరూపించాం’అని దీప్కే అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement