ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ! | Did CJP 72 Hour Ultimatum Trigger Dharmendra Pradhan Exit | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!

Jul 25 2026 9:30 PM | Updated on Jul 25 2026 9:45 PM

Did CJP 72 Hour Ultimatum Trigger Dharmendra Pradhan Exit

ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్‌లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.

నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.

నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.

ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.

శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్‌.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.

ఒక వైపు, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.

ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement