న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వేదికపై.. తాము విజయం సాధించామని ప్రకటించారు. అయితే, 26 రోజుల నిరాహార దీక్షతో ఈ నిరసనను దేశవ్యాప్త ఉద్యమంగా మార్చిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ పేరును తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు.
శనివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికపై దీప్కే మాట్లాడుతూ.. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకు నన్ను హీరోగా చూడొద్దు. ఆ తప్పు చేయకండి. ఒక వ్యక్తిని హీరోగా మార్చడం వల్లే ఈ దేశం నష్టపోయింది. ప్రభుత్వానికి తలవంచకపోతే ఎవరినైనా రాజీనామా చేయించగలమని ఈ విజయం నిరూపించింది. ఇది ప్రజాస్వామ్యం" అని పేర్కొన్నారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన సోనం వాంగ్చుక్ గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉద్యమానికి బలం ఇచ్చిన వాంగ్చుక్
అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి జూన్ 6న భారత్కు వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రారంభించారు. తొలి రోజుల్లో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు. సౌరభ్ దాస్, ఆశుతోష్ రంకా, ఉద్యోగం కోల్పోయిన విజయతా దహియా వంటి కొద్దిమంది సహచరులు మాత్రమే ఆయనతో ఉన్నారు. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతకు మద్దతు ప్రకటించారు.
ప్రారంభంలో నిరసనకు పెద్దగా స్పందన లేకపోవడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, జూన్ 28న వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగి, నిరసనకు భారీగా మద్దతు రావడం ప్రారంభమైంది. జంతర్ మంతర్కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఆసుపత్రికి తరలింపు.. ఉద్యమానికి మరింత ఊపు
పరిస్థితి విషమించడంతో జూలై 18న ప్రభుత్వం వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. అనంతరం ఆయనను గురుగ్రామ్లోని మెదంతా ఆసుపత్రికి మార్చారు. ఆసుపత్రిలోనే ఆయన నిరాహార దీక్ష కొనసాగించడంతో, అది ఉద్యమానికి కేంద్ర బిందువైంది. లక్షలాది మంది తమ వాట్సాప్ డీపీగా "ఐ సపోర్ట్ సోమ్" అనే సందేశంతో వాంగ్చుక్ ఫొటోను పెట్టుకున్నారు.
ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా, పంపిన సందేశాలు నిరసనకారులకు స్ఫూర్తినిచ్చాయి. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి భారీగా హాజరుకావాలని కూడా వాంగ్చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్గొనకపోతే "దెయ్యంలా తిరిగి వస్తాను" అంటూ భావోద్వేగ వ్యాఖ్య కూడా చేశారు.
పోలీసుల చర్యలతో మరింత ఉద్ధృతం
జూలై 20న వేలాది మంది పార్లమెంట్ వైపు కదిలారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలప్రయోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, వేలల్లో ప్రజలు జంతర్ మంతర్కు చేరుకున్నారు. దీంతో ఉద్యమం అత్యున్నత స్థాయికి చేరింది.
నిరాహార దీక్ష విరమణపై విమర్శలు
జూలై 22న కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీల నేపథ్యంలో వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ఆయన తన వైఖరిని సడలించారని విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేయగా, వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవాలని, విమర్శకులు మానవీయ కోణంలో ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఉద్యమం సీజేపీని దాటి..
సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. "ఇది ఇప్పుడు సీజేపీకి మాత్రమే సంబంధించిన ఉద్యమం కాదు. దేశవ్యాప్తంగా ప్రజలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ ఉద్యమం సీజేపీ కంటే చాలా పెద్దదిగా మారింది. వాంగ్చుక్ సర్ నిరాహార దీక్ష విరమించడం మాకు సంతోషమే. ఆయన ఆరోగ్యం గురించి మేము చాలా ఆందోళన చెందాం. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చింది ఆయనే" అని పేర్కొన్నారు.
విజయ ప్రసంగంలో మౌనం
ఉద్యమం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థను దాటి ప్రజల ఉద్యమంగా మారినప్పటికీ.. ఉద్యమానికి బలం, విశ్వసనీయత, పోరాట స్ఫూర్తి అందించిన సోనం వాంగ్చుక్ పేరును విజయ ప్రసంగంలో అభిజీత్ దీప్కే ప్రస్తావించకపోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన 26 రోజుల నిరాహార దీక్షే యువత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


