సాక్షి,న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై సీజేపీ, విద్యార్థులు గత 23 రోజులుగా చేపట్టిన ఉద్యమం విజయం సాధించింది. వీరి ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా యువతలో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురైన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపధ్యంలోఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో విద్యాశాఖను ఎవరు చేపట్టబోతున్నారు, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై చర్చ తీవ్రమైంది.
కొత్త విద్యామంత్రి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం రాలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ లోపుగా ప్రధానమంత్రి సాధారణంగా ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రికి ఆ శాఖను అదనపు బాధ్యత (Additional Charge) కింద అప్పగిస్తారు. విద్యాశాఖ బాధ్యతలను ఏదైనా సీనియర్ క్యాబినెట్ మంత్రికి అదనపు బాధ్యతగా అప్పగించవచ్చు లేదా ఆదివారం సాయంత్రం నాటికి కొత్త నియామకం ఉత్తర్వులు రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాజీనామా అనంతరం ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని మరో అంచనా.
సినియర్ క్యాబినెట్ మంత్రులకు అదనపు బాధ్యతలను మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, లేదా భూపేందర్ యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి సమర్థవంతమైన పాలనా అనుభవం ఉన్న సీనియర్లకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తరువాత విద్యాశాఖ మంత్రి పదవిని స్వయంగా ప్రధానమంత్రే స్వీకరిస్తారా? లేక సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ, లేదా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్కి అప్పగిస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది.
ఫడ్నవీస్కు పిలుపు
మరోవైపు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ఢిల్లీ పెద్దలనుంచి పిలుపు రావడం మరింత ప్రధాన్యతను సంతరించుకుంది. ఫడ్నవీస్తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే మేధావి, విద్యావంతుడైన ఫడ్నవీస్ విద్యా శాఖమంత్రిగా అర్హుడని శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం విశేషం.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, విద్యాశాఖలో కీలక సంస్కరణల నేపథ్యంలో ప్రత్యా మ్నాయంగా, విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న సహాయ మంత్రుల్లో (జయ్ చౌదరి లేదా సుకాంత్ మజుందార్) ఒకరికి స్వతంత్ర హోదా (Independent Charge) ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంచనా. విద్యాశాఖను తాత్కాలికంగా ఎవరికి అప్పగిస్తారు? లేదా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా సస్పెన్స్ తప్పదు.


