ముంబై: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తల్లి అనితా దీప్కే ఇంటి వద్ద స్వీట్లు పంచుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
"ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇది మా జీవితంలో అద్భుతమైన రోజు. చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన నిజాయితీతో చేసిన కృషికి చివరకు ఫలితం దక్కింది. తాను పెట్టిన డిమాండ్ నెరవేరాల్సిందేనని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే పట్టుదలతో చివరి వరకు పోరాడాడు. మొదట్లో మేము చాలా భయపడ్డాం. తల్లిదండ్రులుగా మాకు చాలా భయం వేసేది.
జైపూర్లో అతనిని చెంపదెబ్బ కొట్టినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఆ రాత్రంతా మేము నిద్రపోలేకపోయాం. అతను తిరిగి వచ్చిన తర్వాత స్వీట్లు పంచి, అందరం కలిసి ఘనంగా సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఈ విజయంతో చాలా ఆనందంగా ఉంది. పిల్లలంతా ఇప్పుడు విముక్తి పొందారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చాలా, చాలా సంతోషంగా ఉంది.
అభిజీత్ గురించి చాలా గర్వంగా ఉంది. అభిజీత్ చాలా మంచి పని చేశాడు. మధ్యలో అతనిపై దాడి చేసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఏమవుతుందో అని చాలా ఆందోళన పడ్డాను. అతనికి చెంపదెబ్బలు కొట్టినప్పుడు చాలా బాధగా అనిపించింది. జూన్ 7 నుంచి మా ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. అందరం తీవ్ర ఆందోళనలోనే ఉన్నాం. నాకు టైఫాయిడ్ కూడా వచ్చింది. నా కుమారుడు చాలా గొప్ప పని చేశాడు. అతని వయసు కేవలం 29 సంవత్సరాలు.
అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పని చేశాడు. అతని గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చెప్పాలనుకోవడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల మాట విని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. ఇప్పటివరకు అభిజీత్తో మాట్లాడలేదు. ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ కలవలేదు. తర్వాత టీవీ ఆన్ చేశాం. ఈ రోజంతా టీవీలో అతని గురించే చూస్తున్నాం. నా బిడ్డ ఈ రోజు ఇంత పెద్ద పని చేశాడనే గర్వం కలిగింది. అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. కానీ ఒక యువకుడు ఇంత పెద్ద పని చేసి చూపించాడు. చాలామంది అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ రోజు అతడు ఇంటికి రాడు. ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఎలా ఉంటుందో తెలియదు. రేపు వెళ్లి అభిజీత్ను తీసుకురావాలని అనుకుంటున్నాం. పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం’’ అని తెలిపారు.


