సీజేపీ ఉద్యమాన్ని నడిపించింది వీరే!
సాక్షి, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనలకు, నిరసనలకు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ముందుండి నడిపిస్తే ఈ నిరసనోద్యమానికి ఏడుగురు వ్యక్తులు వెనక వెన్నుముకలా నిలబడి ఉద్యమాన్ని విజయవంతంచేశారు. సీజేపీని స్థాపించడం మొదలు రోజువారీగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం వాంగ్చుక్ నిరాహార దీక్ష తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఈ ఏడుగురు వ్యూహకర్తలే కీలక భూమిక పోషించారు.
లాయర్లు, జర్నలిస్టులు, పబ్లిక్ పాలసీ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులతో కూడిన ఈ బృందం ఉమ్మడి కృషితో ఉద్యమాన్ని ముందుకు సాగేలా దిశానిర్దేశంచేస్తోంది. వేదికపై వాగ్దాటితో ఉపన్యాసాలు చేసే నాయకుల పైనే కాకుండా, వెనుక ఉండి వ్యూహాలు రచించేవారు, మీడియా సమన్వయకర్తలు, చట్టపరమైన పోరాటం చేసేవారు, విద్యార్థి–జన సమీకరణ చేసేవారిపైనే ఉద్యమ విజయఫలితం ఆధారపడి ఉంటుందని సీజేపీ కీలక నాయకత్వం మరోసారి నిరూపించింది. దీంతో ఈ
ఏడుగురు ఎవరనే చర్చ మొదలైంది. వీళ్ల గురించి క్లుప్తంగా..
వైష్ణవి (పాలసీ నిపుణురాలు)
ఢిల్లీకి చెందిన వైష్ణవి సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఈమె విధాన నిర్ణయాల రూపకల్పనలో దిట్ట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ప్రముఖ పరిశోధనా సంస్థల్లో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. విధాన రూపకల్పన, విద్యా వ్యవస్థలోని అంశాలపై ఈమెకున్న అవగాహన పార్టీ వ్యూహాల రచనకు ఎంతగానో తోడ్పడుతోంది.
ఆఫ్రీన్ (సామాజిక ఉద్యమకారిణి)
బెంగళూరుకు చెందిన ఆఫ్రీన్ ఎంబీఏ పూర్తి చేసింది. కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని ఈ ఉద్యమంలోకి వచ్చారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో గమనించిన ఆమె సామాజిక అంశాలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సీజేపీ వక్తగా కొనసాగుతూ యువత, విద్యార్థి వర్గాల సమస్యలను బలంగా వినిపిస్తున్నారు.
దీపక్ బలియాన్ (విద్యార్థి నేత)
దీపక్ బలియాన్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చారు. సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రైతులు, యువత సమస్యలపై పనిచేసారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై సీజేపీ తరఫున పోరాడుతున్నారు. గ్రామీణ ప్రాంత యువత సమస్యలపై గళమెత్తుతున్నారు.
రత్నా సింగ్ (న్యాయవాది)
న్యాయపరమైన వ్యవహారాల బాధ్యతలను రత్నా సింగ్ పర్యవేక్షిస్తున్నారు. లా చదువుకున్నారు. జర్నలిజంలోనూ మంచి పట్టుంది. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ’స్క్రోల్’, ‘బార్ అండ్ బెంచ్’వంటి ప్రముఖ న్యాయ–మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ పార్టీ తరఫున చట్టపరమైన అంశాలను పర్యవేక్షస్తున్నారు.
అశుతోష్ రాంకా (సామాజిక ఉద్యమాల అనుభవం)
జైపూర్ కు చెందిన అశుతోష్ రాంకాకు సామాజిక ఉద్యమాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. సీజేపీ కంటే ముందు ఆయన ‘పరివర్తన్’అనే సంస్థ ద్వారా ఆరావళి పర్వతాల పరిరక్షణ, ధోల్ కా బాడ్ అడవులను కాపాడుకోవడం, నీట్ పరీక్షల అవకతవకలపై ఆందోళనలు చేపట్టారు. ఆయన అనుభవం సీజేపీ ప్రజా ఆందోళనలకు పెద్ద దిక్సూచిగా మారింది.
సౌరభ్ దాస్ (ప్రజా సంబంధాలు)
సౌరభ్ దాస్ స్వస్థలం ఢిల్లీ. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివి స్వతంత్ర పరిశోధనాత్మక విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం
సీజేపీ ప్రధాన వక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియాతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉద్యమ సమస్యలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు.
సిద్ధాంత్ (డిజిటల్ మీడియాలో పట్టు)
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన సిద్ధాంత్ పూర్తిగా తెరవెనుక ఉండి సీజేపీ ఉద్యమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లారు. డిజిటల్ క్యాంపెయిన్ బాధ్యతలు పూర్తిగా ఈయనే చూసుకుంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆందోళనల వివరాలు డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఈయన అవలంభించిన సోషల్ మీడియా వ్యూహాలు సీజేపీకి ఎంతగానో కలసివస్తున్నాయి.


