విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్‌ | Sachin Tendulkar Amid-Student Protests Shares His Father Inspired Words, Urges Fairness And Justice For Students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్‌

Jul 24 2026 7:09 AM | Updated on Jul 24 2026 10:12 AM

Sachin Tendulkar-Amid-Student-Protests-Shares-His-Father-Inspired-Words

Photo Credit: BCCI Twitter

నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్ర‌రూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో జంత‌ర్‌మంత‌ర్‌కు త‌ర‌లివ‌స్తూ ఆందోళ‌న‌ల‌కు మ‌ద్దతు తెలుపుతున్నారు. 

ఈ క్ర‌మంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసిన‌ప్ప‌టికీ విద్యార్థులు ఏమాత్రం బెద‌ర‌కుండా త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు.  

ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్‌ గురువారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్టు చేశాడు. 

స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 

తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్‌’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

సచిన్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు కోహ్లి, శుబ్‌మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement