గోళీలాట మాదిరే లాన్‌ బౌల్స్‌.. కాని చిన్న ట్విస్ట్‌! | What Is Lawn Bowls Game-How It Play-What-Are-Rules-Scoring System | Sakshi
Sakshi News home page

గోళీలాట మాదిరే లాన్‌ బౌల్స్‌.. కాని చిన్న ట్విస్ట్‌!

Jul 24 2026 8:08 AM | Updated on Jul 24 2026 10:45 AM

What Is Lawn Bowls Game-How It Play-What-Are-Rules-Scoring System

Photo Credit: IOA Twitter

ప్రపంచంలో మనకు తెలియని ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌.. ఇవన్నీ ప్రపంచ క్రీడలుగా విశిష్టతను పొందాయి. కానీ ఒలింపిక్స్‌ లేదా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరిగినప్పుడు మాత్రం మనకు తెలియని కొత్త గేమ్స్‌ కూడా పరిచయమవుతాయి. అలా పరిచయం అయిందే లాన్‌ బౌల్స్‌ క్రీడ. 

2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో లాన్‌ బౌల్స్‌లో భారత్‌ ఒక స్వర్ణంతో పాటు మరో రజతం గెలవడం ద్వారా మన దేశంలో ఈ ఆట తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఆట చూడ్డానికి చిన్నప్పుడు మనం ఆడే గోళీలాట మాదిరే ఉంటుంది. కానీ గోళీలాటకు కాస్త భిన్నంగా లాన్‌ బౌల్స్‌ ఆట ఉంటుంది.

లాన్ బౌల్స్ అనేది ఇంచుమించుగా బౌలింగ్ క్రీడ మాదిరి ఉంటుంది. ఒక ఎండ్ నుంచి రౌండ్ గా ఉన్న బంతులను మరో ఎండ్ లో ఉన్న టార్గెట్ మీదకు వదలాలి. ఎవరిదైతే టార్గెట్ కు దగ్గరగా చేరుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ టార్గెట్ ను జాక్ గా పిలుస్తారు. ఉదాహరణకు ’బి‘ టీం కంటే కూాడా  ’ఎ‘ టీమ్ టార్గెట్ కు సమీపంగా రెండు బాల్స్ ను విసిరితే అప్పుడు ఎ టీంకు రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే టార్గెట్ కు ఏ టీంవి ఎక్కువ దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట.  

రూల్స్ ఇలా..
ఈ ఆటను సింగిల్స్, డబుల్స్ తో పాటు ముగ్గురు/ నలుగురితో కూడిన జట్టుగానూ ఆడొచ్చు. టీమ్ ఈవెంట్లలో తొలుత బంతిని విసిరే బౌలర్ ను 'లీడ్' అని పిలుస్తారు. ఇక చివర్లో రోల్ చేసే ప్లేయర్ను 'స్కిప్' అంటారు. ఇరు జట్లు లేదా ఇద్దరు ప్లేయర్లు తమ బౌల్స్ను రోల్ చేయడం పూర్తయిన తర్వాత.. పాయింట్లను లెక్కిస్తారు. జాక్ కు బౌల్ దగ్గరగా వెళ్లడం లేదా తాకడమే ఈ ఆట లక్ష్యం. 

సింగిల్స్ విభాగంలో ఎవ‌రైతే తొలుత 21 పాయింట్లకు చేరుతారో వారిని విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. ఇక‌ టీమ్ ఈవెంట్స్‌లో మాత్రం రౌండ్లన్నీ పూర్తయ్యాకనే విజేత ఎవరనేది తేలుస్తారు. జాకు బంతి తగిలిందా? ఎంత దూరంలో నిలిచింది అనేదే ఇక్కడ ప్రధానం. దాని ఆధారంగానే పాయింట్లను నిర్ణయిస్తారు.

ఇక లాన్ బౌల్స్ గేమ్‌లో భార‌త్ శుభారంభం చేసింది. లాన్‌ బౌల్స్‌ మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో భారత్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్‌’లో మాల్టాను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ పుతుల్‌ సోనోవాల్‌ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్‌’లో 2023 ప్రపంచ చాంపియన్‌ రియాన్‌ బెస్టెర్‌ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు.  

Read: విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement