Photo Credit: BCCI Twitter
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.
అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్ను జపాన్తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
పురుషుల క్రికెట్లో ఇలా..
పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి.
క్వార్టర్స్లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్లో తలపడనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్
గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్
జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..
మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్తో జపాన్, థాయ్లాండ్తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన జట్లు సెమీస్లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.
మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్
భారత్ vs జపాన్
బంగ్లాదేశ్ vs చైనా
శ్రీలంక vs మలేషియా
పాకిస్తాన్ vs థాయిలాండ్
సెమీ-ఫైనల్స్
భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనా
శ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్
2022లో డబుల్ స్వర్ణాలు..
2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.


