వైట్హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ పార్టీ
వ్యంగ్య విమర్శలు, తిట్లతో ప్రసంగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. వైట్హౌస్ వ్యవహారాలను చూసే పత్రికా విలేకరులతో జరిగిన విందు సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరిని విమర్శించి.. మరికొందరిపై ప్రశంసలు కురిపించి ప్రజా ప్రతినిధులు కొందరిపై జోకులేస్తూ సుమారు గంట సేపు మాట్లాడిన ట్రంప్ తాను మూడోసారి కూడా గద్దెనెక్కవచ్చునని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఈ వైట్హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ ఈ ఏడాది ఏప్రిల్లోనే జరగాల్సి ఉండింది. అయితే ఆ సమావేశంలో అజ్ఞాత వ్యక్తి ఒకరు కాల్పులు జరపడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలో వాయిదా పడ్డ డిన్నర్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఎన్నో మాట్లాడాలి అనుకున్న చాలా అంశాలను కొట్టేశానని అన్నారు. ‘‘ఏప్రిల్లోనే ఈ స్పీచ్ ఇవ్వాలని అనుకున్నా.. కాకపోతే గన్మాన్ కాల్పులతో తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించారు.
‘‘మూడు నెలల క్రితం చెప్పినట్లే... షో నడుస్తూనే ఉండాలి’’అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ట్రంప్ ఆ రోజు మూక హత్యలు జరిగి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయన తనదైన శైలిలో హాస్యం, వ్యంగ్యం కలిపేస్తూ విమర్శలు, తిట్లు అందుకున్నారు. కరెస్పాండెంట్స్ డిన్నర్కు తాను వచ్చే ఏడాదీ హాజరవుతానని వ్యాఖ్యానించారు. మీడియాతో ట్రంప్ సంబంధాల్లో ఈ డిన్నర్ ఒక అరుదైన క్షణంగా నిలిచిపోనుంది. ఎందుకంటే రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే మీడియా ప్రతినిధులపై ట్రంప్ రకరకాలుగా మాటల దాడులు చేయడం, కొందరిపై కేసులేయడం, మరికొందరిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సమావేశాలకు హాజరు కావొద్దంటూ నిషేధం విధించిన కొందరు విలేకరులు కూడా ఈ డిన్నర్ సమావేశాలకు హాజరు కావడం గమనార్హం.
ట్రంప్కు మొదటనుంచి కొంతమంది రాజకీయ నేతలన్నా.. మీడియా ప్రతినిధులన్నా పీకలదాకా కోసం. జేన్ ఫోండా, బ్రూస్ స్ప్రింగ్స్టీన్ వంటి వారితోపాటు మాజీ అధ్యుక్షుడు ఒబామాకు ఆయన రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూంటాడు. ఒబామాను కాస్తా ‘బరాక్ హుస్సేన్ ఒబామా’అంటూంటారు. అలాగే జిమ్మీ ఫాలన్, జిమ్మీ కిమ్మెల్, ప్రజా ప్రతినిధులు ఇల్హాన్ ఒమార్, డి–మిన్, కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ వంటి వారిపై కూడా తన గంట ప్రసంగంలో తనదైన రీతిలో విమర్శలు కురిపించారు ట్రంప్. వీటిల్లో కొన్ని వివక్షాపూరితమైనవి కూడా ఉండటం విశేషం. జర్నలిజమ్ వృత్తి అంటే తనకు గౌరవమేనని అన్న ట్రంప్ తనను సవాలు చేస్తూ రాసిన కథనాలపై మాత్రం విమర్శలు కురిపించారు. వచ్చేసారి తాను ‘ట్రంప్–2028’అన్న టోపీ వేసుకుని అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని నవ్వుతూ చెప్పిన ఆయన ఆ వెంటనే జోక్ చేస్తున్నానని సర్దుకున్నారు.
సాహసవీరులకు అవార్డులు..
ఏప్రిల్ కాల్పుల సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సీక్రెట్ సరీ్వస్ ఏజెంటు విక్టర్ గోంజాల్వెజ్తోటు, వాషింగ్టన్ హిల్టన్ (సమావేశం జరిగిన హోటల్) హోటల్ సిబ్బంది కొందరిని తాజా డిన్నర్ సమావేశంలో సత్కారం జరిగింది. గత అనుభవం దృష్ట్యా ఈసారి కొంచెం చిన్న వేదికను ఎంచుకున్నారు. అలాగే భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.... పత్రికా స్వేచ్ఛ సంబరాలు అన్న పేరుతో ఈ సమావేశాలు జరగడం. సుమారు 700 మంది ఈ డిన్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు. రెడ్ కార్పెట్ వంటి హంగులేవీ కనిపించలేదు. అయితే ఈ సమావేశానికి హాజరైన వారిలో కొంతమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సమావేశం ఒకప్పుటి ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రస్తుత వాల్డ్రాఫ్ అస్టోరియాలో జరగడం కొసమెరుపు.


