శివసాగర్: అసోంలో తలెత్తిన వరదలు అపార నష్టాన్ని తీసుకొస్తున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సుమారు 6.55 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఏడాది వరదల వల్ల మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 66కి చేరుకుంది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా శివసాగర్ జిల్లాలో ముగ్గురు, చరైదేవ్ జిల్లాలో ఒకరు మరణించారు. శుక్రవారం నాటికి తొమ్మిది జిల్లాల్లో 7.05 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురికాగా, శనివారం నాటికి ఆ సంఖ్య 6,54,800కి తగ్గింది. చరైదేవ్, దిబ్రూగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాలు వరద ప్రభావంతో అతలాకులమవుతున్నాయి.
శివసాగర్ జిల్లా వరదలకు తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ సుమారు 2.9 లక్షల మంది వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆ తర్వాత చరైదేవ్లో 1.9 లక్షల మంది, జోర్హాట్లో 1.3 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఆరు జిల్లాల్లో 274 సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో సుమారు 18,902 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 810 గ్రామాలు నీటమునిగాయి. అలాగే 34,970.8 హెక్టార్లలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పలు నదీగట్లు, రోడ్లు, వంతెనలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. శివసాగర్, నుమాలిగఢ్ ప్రాంతాల్లో దిఖౌ, ధన్సిరి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.


