అటు బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. ఇటు గుజరాత్‌లో ‘ఫ్లాష్‌ ఫ్లడ్స్‌’ అలర్ట్‌ | Natures Fury Strikes: Brahmaputra Swells Gujarat on Red Alert | Sakshi
Sakshi News home page

అటు బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. ఇటు గుజరాత్‌లో ‘ఫ్లాష్‌ ఫ్లడ్స్‌’ అలర్ట్‌

Jul 24 2026 1:56 PM | Updated on Jul 24 2026 1:59 PM

Natures Fury Strikes: Brahmaputra Swells Gujarat on Red Alert

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ఇప్పటివరకు కనీసం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుండగా.. గుజరాత్‌లో రికార్డు స్థాయి వర్షాలతో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

బ్రహ్మపుత్ర ఉగ్రరూపం.. అసోంలో వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బ్రహ్మపుత్ర సహా పలు నదులు ఉప్పొంగడంతో 25 జిల్లాల్లోని 1,800కు పైగా గ్రామాలు నీటమునిగాయి. లక్షలాది మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

అయితే మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. నదీ పరివాహక ప్రాంతాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి.

గుజరాత్‌లో ‘వర్ష’ విపత్తు
అసోంతో పాటు పశ్చిమ భారతంలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో కేవలం 24 గంటల్లోనే 1,100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

సహాయక బృందాలు సుమారు 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నవ్‌సారీ, వల్సాద్‌ సహా పలు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

సౌరాష్ట్రపై పొంచి ఉన్న ముప్పు
గుజరాత్‌పై ప్రస్తుతం ఓ వాతావరణ వ్యవస్థ ప్రభావం చూపుతోంది. దాదాపు ఒకే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ వాయుగుండం తరహా వ్యవస్థ భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలో రాత్రివేళ వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అహ్మదాబాద్‌ సహా మధ్య గుజరాత్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎందుకింత తీవ్రత?
సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య దేశానికి అవసరమైన వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. అయితే తక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడం వల్ల నదులు, డ్రైనేజీ వ్యవస్థలు తట్టుకోలేక వరదలు సంభవిస్తున్నాయి. ఈసారి పలు ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న అతిభారీ వర్షాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ముఖ్యంగా నదులు పొంగిపొర్లడం, నేలలో తేమ అధికంగా ఉండటం వల్ల వరద ముప్పు పెరిగింది.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో ప్రయాణించవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవైపు అసోంలో వరదల విలయం.. మరోవైపు గుజరాత్‌లో కుండపోత వర్షాలు.. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రకృతి పరీక్ష పెడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement